
టీ అమ్ముకునే వ్యక్తి ఏంటి.. సైబర్ మోసం చేయడమేంటి..? అని అనుకుంటున్నారు కదా. కానీ అరచేతిలో ఫోన్ వచ్చాక సాఫ్ట్ వేర్ నాలెడ్జి ఉన్నవాళ్లు చేసే పనులు సామాన్యుడు కూడా చేయగల్గుతున్నాడు అనటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో. టెక్నాలజీ రెండు వైపుల పదునున్న కత్తి.. ఎలా వాడితే అలాంటి రిజల్ట్స్ వస్తాయి అంటే ఇదే మరి. గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఈ భారీ మోసం పోలీసులనే షాకింగ్ కు గురిచేసింది. ఈ యువ చాయ్ వాలా చేసిన ఫ్రాడ్ గురించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సూరత్ కు చెందిన సచిన్ మనోజ్ బాయి ముదాన్వా (21) అనే చాయి వాలా.. 41 లక్షల రూపాయల సైబర్ మోసం వైరల్ గా మారింది. బొరివ్లీ నివాసి అయిన 60 ఏళ్ళ వృద్ధుడు 41 లక్షల రూపాయల పెట్టుబడి మోసానికి గురైన కేసును దర్యాప్తు చేస్తుండగా ఈ బాగోతం బయటపడింది.
అధిక లాభాల ఆశ చూపి:
ముదాన్వా చాలా తెలివిగా వృద్ధుడిని ట్రాప్ చేశాడు. పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి వివిధ అకౌంట్ల నుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. అందులో 2 లక్షల రూపాయలు మొదాన్వా అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
కేవైసీ, ట్రాన్జాక్షన్ వివరాలు చెక్ చేసిన తర్వాత.. మొదాన్వాను సూరత్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సిటీలో టీ స్టాల్ నడుపుతూ.. పరిచయం అయిన వ్యక్తులతో పెట్డుబడి గురించి చెప్తూ ఆశచూపేవాడని పోలీసులు తెలిపారు. ఆ విధంగా పెట్టుబడుల రూపంలో డబ్బులు అకౌంట్లో వేయించుకుని ఫ్రాడ్ మొదలెట్టాడని చెప్పారు. ఏప్రిల్ 3న కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీ లోకి తీసుకున్నారు పోలీసులు. అయితే మొదన్వా వెనుక పెద్ద అంతర్రాష్ట్ర ముఠా ఉందేమో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఫేస్ బుక్ లో మహిళగా ఎర..
మొదాన్వా చాలా తెలివిగా జనాలను నమ్మించేవాడని దర్యాప్తులో తేలింది. మహిళ ఫోటో డీపీగా పెట్టుకుని.. ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా ఆకర్షించేవాడు. S18-Value Growth Circle అనే గ్రూప్ ద్వారా యూజర్లను అట్రాక్ట్ చేసి.. పెట్టుబడి పేరున విశ్వాసం కల్పించేవాడు. అధిక లాభాలు చెప్పి.. ఇన్వెస్ట్మెంట్ యాప్ డౌన్ లోడ్ చేయించేవాడు. కొన్ని వారాల పాటు డబ్బును పెట్టుబడి పేరున డిపాజిట్ చేయించేవాడు. వృద్ధుడిని కూడా అదే విధంగా పెట్టుబడి పెట్టించాడు. డబ్బు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. మిగతా 83 లక్షల రూపాయలు కట్టాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీంతో సైబర్ హెల్ప్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయటపడింది.