
మనతెలంగాణ/హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే రెండుసా ర్లు ప్రజా ప్రభుత్వం ప్రజా పా లన గ్రామసభలు, వార్డు సభల తో నేరుగా ప్రజల వద్దకు చేరుకుంది. ప్రజా ప్రభుత్వం మూ డోసారి ప్రజల్లోకి వెళుతోంది. ప్రజా ప్రభుత్వం అధికారం చే పట్టిన తర్వాత 2023 డిసెంబర్లో 28 వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాల న గ్రామ, వార్డు సభలను నిర్వహించగా 2025 జ నవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు రెండోసారి ప్రజా పాలన గ్రామ సభలు, వార్డు సభలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ రెండు విడతల్లోనూ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారి నుంచి అ ర్జీలు స్వీకరించటంతో పాటు ప్రజలతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకునే ప్ర యత్నం చేసింది. ప్రజల స మక్షంలో వచ్చిన అర్జీలతో నే ప్రభుత్వం వివిధ సం క్షేమ పథకాలను అ మలు చేసింది. అక్కడ తీసుకున్న అర్జీల ఆధారంగానే రైతు రుణమాఫీ, రైతు భ రోసా, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచి త విద్యుత్, కళ్యాణలక్ష్మి, షాదీ ము బారక్, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జా రీ, సన్న బి య్యం పంపిణీ, సన్న వడ్లకు రూ.500 బోనస్ పథకాలను అమలు చేసింది. ఇప్పుడు మూడోసారి ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణకు నడుం బిగించింది.
పౌర సేవలు, ప్రజల అవసరాలతో మమేకమై ఉండే అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు తలపెట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అయిదు స్థాయిల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతోంది. మార్చి 6వ తేదీ నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యంతో పాటు పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయనుంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందస్తు ఉత్సవంగా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేసింది. గ్రామ సభలు, వార్డు సభల నిర్వహణతో పాటు మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సరికొత్త కార్యాచరణకు నడుం బిగించింది. మండలాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల అధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. అన్ని స్థాయిల్లోనూ గ్రామ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపిల వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది.
రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు
రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వాటితో లబ్ధి పొందిన కుటుంబాలు, లబ్ధి పొందిన వర్గాలకు చేసిన మేలును క్షేత్ర స్థాయిలో చెప్పుకోవటంతో పాటు అర్హులకు ప్రభుత్వ పథకాలు తప్పకుండా అందించాలన్న సంకల్పంతో ఈ సభలను ఏర్పాటు చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో వస్తున్న సంస్కరణలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను ప్రజలకు వివరించనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించే 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను గుర్తించి, పిల్లల తల్లితండ్రుల్లో అవగాహన పెంచనుంది. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్ ప్రధానంగా సోలార్ విద్యుత్ వినియోగం పెంచటం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను ప్రజలకు, రైతులకు తెలియజేయాలని లక్ష్యంగా ఎంచుకుంది. ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలన్న ప్రజా ప్రభుత్వ లక్ష్యాన్ని నూటికి నూరుపాళ్లు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది.
నిరంతరం రేషన్కార్డులను ఇవ్వాలని…
పదేళ్లు ఇవ్వని రేషన్ కార్డులను, అర్హులకు ఇవ్వాలని, ఇదో నిరంతర ప్రక్రియగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు నైపుణ్యాల శిక్షణతో పాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలు 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా చేపట్టనుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించి లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని టార్గెట్గా ఎంచుకుంది. ఇందిరా మహిళా శక్తి సాధిస్తున్న విజయాలను, కొత్తగా వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించనుంది. అన్ని జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించనుంది.
1వ వారం- గ్రామీణ అభివృద్ధి, 2వ వారం ఆరోగ్య రంగం
1వ వారం – గ్రామీణ అభివృద్ధి (మార్చి 30 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ), 2వ వారం ఆరోగ్య రంగం (ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు) 3వ వారం – అరైవ్ అలైవ్ ( ఏప్రిల్13 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు) 4వ వారం – సంక్షేమం (ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు) 5వ వారం – పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట (ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే2వ తేదీ వరకు) 6వ వారం- రైతు సంక్షేమం (మే 4వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు) 7వ వారం -విద్య(మే 11వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు) 8వ వారం – యువత, క్రీడలు (మే 18వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు) 9వ వారం -మహిళా సంక్షేమం (మే 25వ తేదీ నుంచి మే 30 వ తేదీ వరకు) 10వ వారం- పర్యావరణం( జూన్1వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ)వరకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టనుంది.