Reading Time: < 1 minute

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి డివిజన్ల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హై కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జిహెచ్‌ఎంసి డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఎంసిహెచ్‌ఆర్డిలో సెంటర్‌ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆ నివేదికను బయటపెట్టలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. చట్టపరిధిలోనే డీలిమిటేషన్ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది బుధవారమే కోర్టుకు వివరించారు. సమాచారం ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఉంచామని, ఇప్పటివరకు అందిన 3,100 అభ్యంతరాలు పరిష్కరిస్తున్నామన్నారు.