Reading Time: < 1 minute
Insult To Gandhis Ideals Rahul Gandhi Attacks Centre Over Plan To Scrap Mgnrega

Rahul Gandhi: ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని యోచిస్తున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది మహాత్మాగాంధీ ఆదర్శాలకు అవమానమని అన్నారు. గ్రామీణ కుటుంబాలకు ప్రతీ ఏడాది 100 రోజుల వేతన ఉపాధికి చట్టపరమైన హామీని అందించే పథకాన్ని రద్దు చేయాలని మోడీ సర్కార్ యోచిస్తోందని మండిపడ్డారు. కేంద్రం కొత్తగా రోజ్‌గార్ మరియు అజీవిక మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లు, 2025ను తీసుకురావడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: Messi row: మెస్సీ పర్యటన వైఫల్యం.. క్రీడామంత్రి రాజీనామా, అధికారులకు నోటీసులు..

ప్రధాని మోడీకి రెండు విషయాలు నచ్చవని, మహాత్మాగాంధీ ఆలోచనలు, పేదల హక్కులు నచ్చవని ఎక్స్‌లో ఆరోపించారు. “MGNREGA అనేది మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ దార్శనికతకు సజీవ స్వరూపం. ఇది లక్షలాది మంది గ్రామీణ భారతీయులకు జీవనాధారంగా ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కీలకమైన ఆర్థిక భద్రతా వలయంగా నిరూపించబడింది” అని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పద్ధతి ప్రకారం బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ పథకం మోడీని అసౌకర్యానికి గురిచేస్తోందని అన్నారు. కేంద్రం తీసుకురాబోతున్న కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రోడ్ల నుంచి పార్లమెంట్ వరకు నిరసన తెలుపుతాయని ఆయన అన్నారు. కొత్త బిల్లు మహాత్మా గాంధీ ఆదర్శాలకు అవమానమని, నిరుద్యోగం ద్వారా భారత దేశ యువత భవిష్యత్తును నావనం చేసిన తర్వాత, మోడీ ప్రభుత్వం ఇప్పుడు గ్రామీన పేదల జీవనోపాధిని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు.

కేంద్రం MGNREGA స్థానంలో కొత్త ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (VB-G RAM G) బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది. ప్రతిపాదిత పథకం 60:40 కేంద్ర-రాష్ట్ర నిధుల పంపిణీతో 125 రోజుల వేతన ఉపాధికి హామీ ఇస్తుంది, ఈ బిల్లు ఆమోదం పొందితే 2005 నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తుంది.ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో తీసుకువచ్చింది.