Reading Time: < 1 minute
Ind Vs Sa Axar Patel Ruled Out Of Remaining T20s Big Question Over Jasprit Bumrah

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అతడు వైదొలగాల్సి వచ్చిందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. మూడో టీ20 మ్యాచ్‌లోనూ అక్షర్‌ ఆడని విషయం తెలిసిందే. వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం అక్షర్‌ లక్నోలో జట్టుతోనే ఉన్నాడు. అతడి స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.

రంజీ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాఖ్‌ అలీ ట్రోఫీలో రాణించడంతో షాబాజ్ అహ్మద్‌ భారత జట్టులోకి వచ్చాడు. అయితే అతడికి తుది జట్టులో చోట దక్కడం కష్టమే. 31 ఏళ్ల షాబాజ్‌ భారత్‌ తరఫున 2 టీ20లు, 3 వన్డేలు ఆడాడు. చివరిసారిగా 2023 సెప్టెంబర్‌లో ఆసియా క్రీడల సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లో రెండు వికెట్స్ తీశాడు. అయితే అతడికి ఇంకా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. డిసెంబర్ 17న లక్నోలో నాల్గవ టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.

Also Read: Shaheen Afridi: షాహీన్ అఫ్రిదికి ఘోర అవమానం.. ఓవర్ మధ్యలోనే బౌలింగ్ నుంచి తప్పించిన అంపైర్!

స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడం గురించి బీసీసీఐ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ధర్మశాలలో జరిగిన టీ20కి బుమ్రా అందుబాటులో లేడు. వ్యక్తిగత కారణాల వల్ల అతను ముంబైకి తిరిగి వచ్చాడు. జట్టులోకి తిరిగి రావడంపై ఇంకా అధికారిక సమాచారం లేదు. మూడో టీ20లో బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ఆడాడు. 4 ఓవర్లలో 34 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. రెండో టీ20లో తేలిపోయిన హర్షదీప్ సింగ్ మూడవ టీ20లో మెరిశాడు. 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి 2 వికెట్స్ తీశాడు.