Reading Time: 2 minutes
Aung San Suu Kyi Son Alive Concerns Detention

Aung San Suu Kyi: మయన్మార్‌లో తాజాగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆ దేశ అగ్ర నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ గురించి ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె కుమారుడు కిమ్ అరిస్ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలుగా తన తల్లి గురించి తనకు ఏ వార్తలు అందలేదని అన్నారు. “గత రెండు సంవత్సరాలుగా ఆమెను ఎవరూ చూడలేదు. కుటుంబ సభ్యులను, న్యాయవాదిని కూడా కలుసుకోనిలేదు. కాబట్టి ఆమె ఇంకా బతికే ఉందో లేదో కూడా నాకు తెలియదు” అని అరిస్ అన్నారు.

READ ALSO: Ambati Rambabu: కమీషన్ల కోసమే పీపీపీ అనే దుర్మార్గమైన మోడల్.. మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు..

2021లో మయన్మార్‌లో జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత నుంచి 80 ఏళ్ల సూకీ నిర్బంధంలో ఉన్నారని కిమ్ అరిస్ తెలిపారు. నాటి నుంచి ఆమెకు కుటుంబ సభ్యులను, తన న్యాయవాదులను సంప్రదించడానికి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తన తల్లి నిర్బంధంలోకి వెళ్లిన తర్వాత పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసిందని చెప్పారు. 2021 తిరుగుబాటు తర్వాత మయన్మార్ సైనిక ప్రభుత్వం తాజాగా మొదటి ఎన్నికలను నిర్వహించడానికి ప్లాన్ చేస్తుంది. ఈ ఎన్నికలు దేశంలో డిసెంబర్ 28 నుంచి దశలవారీగా జరగనున్నాయి. అయితే అనేక విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు ఈ ఎన్నికలను గుర్తించడం లేదు. ఈ ఎన్నికలు దేశంలో సైనిక పాలనను చట్టబద్ధం చేయడానికి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి.

ఈ సందర్భంగా అరిస్ మాట్లాడుతూ.. దేశ రాజధాని నేపిడాలో తన తల్లిని నిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం తన తల్లి నుంచి చివరి లేఖ అందుకున్నట్లు తెలిపారు. అందులో ఆమె తను ఉంటున్న గదిలో వేసవి, చలి కాలంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలను ఎదుర్కుంటున్నట్లు ఫిర్యాదు చేసిందని చెప్పారు. ప్రస్తుతం తన తల్లి 27 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నారని ఆయన చెప్పారు. నిజానికి ఈ దేశంలో 2021 జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత మయన్మార్ ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో సాయుధ తిరుగుబాటు, హింస కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో ప్రపంచం మయన్మార్, సూకీ దుస్థితిని మరచిపోతోందని అరిస్ భయపడుతున్నాడు. ఇటీవల సూకీ కుమారుడు కిమ్ అరిస్ జపాన్ వెళ్లిన సందర్భంగా అక్కడి స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మయన్మార్‌లో జరుగుతున్న ఎన్నికలను తిరస్కరించమని, అక్కడి సైనిక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

READ ALSO: Jio Recharge Plan: జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్.. కేవలం రూ.103తో 28 రోజులు!