Reading Time: 2 minutes
Petrol Diesel Price Hike Hormuz Attacks Crude Oil India

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అంతర్జాతీయ జలసంధి హార్ముజ్ దగ్గర మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. చమురు ట్యాంకర్లపై దాడులు జరగడంతో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగవచ్చని తెలుస్తోంది. మే నెల నాటి పరిస్థితులు మళ్లీ రావొచ్చని అంచనా వేస్తున్నారు.

తాజా దాడులతో హార్ముజ్ జలసంధిలో చమురు, గ్యాస్ ట్యాంకర్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బుధవారం ఇరాక్, యూఏఈ ఓడరేవుల సమీపంలో సరుకు రవాణా నౌకలపై జరిగిన వరుస మూడు దాడులు అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో గణనీయమైన అనిశ్చితిని సృష్టించాయి. ఇది ముడి చమురు ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. ముడి చమురు ధరలు, ముఖ్యంగా ఇండియన్ బాస్కెట్ ధరలు, బ్యారెల్‌కు 108.91 డాలర్లకు చేరుకున్నాయి.

బ్రిటిష్ రాయల్ నేవీకి అనుబంధంగా ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) సంస్థ ప్రకారం.. గత కొన్ని గంటల్లో సరుకు రవాణా నౌకలపై క్షిపణులతో దాడులు జరిగాయి. ఇరాక్‌లోని అల్-ఫావ్‌కు ఆగ్నేయంగా ఉన్న ఒక ట్యాంకర్‌ను గుర్తుతెలియని వస్తువు ఢీకొట్టింది. అయితే సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. అంతకుముందు యూఏఈలోని పోర్ట్ రషీద్ సమీపంలో జరిగిన ఒక అనుమానిత దాడి కారణంగా ఒక నౌక ఒకవైపుకు ఒరిగిపోయి నీటితో నిండిపోయింది. ఒమన్ గల్ఫ్‌లో కూడా అనేక నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో నౌకలు అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు.

ఈ దాడుల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 2.5 శాతం పెరిగాయి. భారతదేశం చాలా అధిక ధరకు ముడి చమురును కొనుగోలు చేయవలసి వస్తోంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) డేటా ప్రకారం.. సెప్టెంబర్ 8న ముడి చమురు (ఇండియన్ బాస్కెట్) ధర బ్యారెల్‌కు $108.91కి పెరిగింది. ఆగస్టులో ఇండియన్ బాస్కెట్ సగటు ధర బ్యారెల్‌కు $90.19గా ఉండగా, సెప్టెంబర్ 8 నాటికి ధరలు సుమారు 20శాతం పెరిగాయి.

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు మళ్లీ పెరుగుతాయా?

2026 మే నెలలో మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మే 22వ తేదీన ఇండియన్ బాస్కెట్ ధర బ్యారెల్‌కు $106.26కు చేరుకోగా.. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగు సార్లు పెంచాయి. ఇప్పుడు ధరలు మరోసారి $109కు చేరువవుతున్న తరుణంలో సామాన్య ప్రజలు మరో ద్రవ్యోల్బణపు అలని ఎదుర్కోబోతున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది.

భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 85శాతం పైగా ఎల్‌పీజీలో సుమారు 60 శాతం దిగుమతి చేసుకుంటుందనేది గమనించదగ్గ విషయం. ఈ దిగుమతిలో గణనీయమైన భాగం వ్యూహాత్మకంగా ముఖ్యమైన హార్ముజ్ జలసంధి ద్వారా భారతదేశానికి చేరుతుంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య తీవ్రమవుతున్న ఘర్షణ ఈ మార్గంలో రవాణాకు అంతరాయం కలిగిస్తూ.. దిగుమతి వ్యయాలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదాన్ని పెంచుతోంది.