
జగిత్యాల టౌన్, వెలుగు: బీడీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు.
హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ ఫలాలను పూర్తిస్థాయిలో వర్తింపజేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్.. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు, మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. బీడీ కార్మికుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు యూనియన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చింత భూమేశ్వర్, గౌరవ అధ్యక్షుడు భూమన్న, ఉపాధ్యక్షురాలు అరుణక్క, సహ కార్యదర్శి అనురాధ, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.