Reading Time: 2 minutes
Ktr Alleges Emergency Like Situation In Telangana Meets Governor Over Brs Complaints

KTR: తెలంగాణలో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పులో పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ శాసనసభ వేదికగా చెలరేగిన రాజకీయ ఉద్రిక్తతలు రాజ్‌భవన్‌ (లోక్‌ భవన్‌)కు చేరాయి. సభ ముగిసే వరకు సస్పెన్షన్‌కు గురైన బీఆర్ఎస్ శాసనసభ్యులు చట్టసభలు, పోలీసుల తీరుపై గవర్నర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బుధవారం (సెప్టెంబర్ 9) మధ్యాహ్నం లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న వరుస పరిణామాలను వివరిస్తూ 13 పేజీల సమగ్ర ఫిర్యాదు లేఖను గవర్నర్‌కు అందజేశారు.

అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ భవన్‌లో మాట్లాడారు. “రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. యూరియా కొరత, రైతు భీమాపై విషయాలను ప్రస్తావించాం. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యపై గవర్నర్‌కు కంప్లైంట్ ఇచ్చాం. రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్స్ వేసుకున్నట్టే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము బ్లాక్ టీ షర్ట్స్ వేసుకున్నాం. బ్లాక్ టీ షర్ట్స్‌తో అసెంబ్లీకి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు పట్టుకున్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారు. మాపై దాడి చేసి మా పైనే ఉల్టా కేసులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావు కోరుకున్నారు. వేముల వీరేశం, కుంభం అనిల్ రెడ్డి, నర్సారెడ్డి ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గరకు వచ్చారు. వేల మంది కాంగ్రెస్ గూండాలను ఎర్రవల్లి ఫాం హౌస్‌పై దాడి చేసేందుకు ఉసిగోల్పారు. మేము అనని మాటలను అన్నట్టు స్పీకర్‌కు ఆపాదించారు. దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పీకర్‌ను అవమానిస్తున్నారు. శాసనసభ కాదు దుష్యాసన సభలా మార్చారు. చావు డప్పు ఎప్పుడు కొడుతారో.. మనందరికీ తెలుసు. ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గర చావు డప్పు కొట్టారు. అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై సీఎస్, డీజీపీని పిలిపించి మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మంచివి కాదని గవర్నర్ మాతో చెప్పారు.” అని కేటీఆర్ వివరించారు.