Reading Time: < 1 minute
Telangana Assembly Revanth Reddy Bhatti Meet Speaker Gaddam Prasad

Gaddam Prasad: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. అసెంబ్లీ ముట్టడి, అధికారులపై దాడులు, స్పీకర్ పట్ల బీఆర్ఎస్ నేతల ప్రవర్తనపై ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీకి రాగానే స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయనను పరామర్శించారు. ఇక, సోమవారం అసెంబ్లీ తొలిరోజే బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాసనసభ ప్రాంగణంలో విధుల్లో ఉన్న అధికారులపై బీఆర్ఎస్ నేతలు భౌతిక దాడులకు దిగడమే కాకుండా, మహిళా అధికారుల ముందే చొక్కాలు విప్పుకొని అసభ్యకరంగా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన స్పీకర్ స్థానంలో ఉన్న గడ్డం ప్రసాద్‌ను బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరకర పదజాలంతో దూషించారని పాలకపక్షం మండిపడింది. అసెంబ్లీ ఎదుట జరిగిన ఈ దురదృష్టకర పరిణామాలపై పత్రికలు, టీవీలు, అన్ని మీడియాలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలోనే కంటతడి పెట్టుకున్నారు.

అసెంబ్లీ చరిత్రలోనే ఇదొక బ్లాక్ డేగా మారుతుందని, స్పీకర్‌ను అవమానించడం అంటే మొత్తం తెలంగాణ సమాజాన్ని, దళిత వర్గాలను అవమానించడమేనని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ భావోద్వేగానికి గురైన దృశ్యాలు చూసి తీవ్ర ఆవేదన చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనకు తమ పూర్తి మద్దతు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి భంగం కలిగించేలా వ్యవహరించిన ఎంతటి వారికైనా సరే ప్రభుత్వం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని, ప్రభుత్వం ఆయనకు అండగా నిలుస్తుందని స్పీకర్‌కి సీఎం హామీ ఇచ్చారు.