Reading Time: 2 minutes
అభిషేక్ విధ్వంసాన్ని అడ్డుకున్న గిల్! కానీ, ఉన్నంతసేపు ఊచకోతే.. కేవలం 15 బంతుల్లోనే

షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్‌లో భాగంగా సోమవారం ఫాజిల్కా ఫాల్కన్స్ వర్సెస్ అమృత్‌సర్ సూర్మాస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే తనకు అలవాటైన దూకుడుతో దుమ్మురేపాడు. ఫోర్లు, సిక్సులతో అదరగొట్టాడు. బౌలర్ ఎవరనేది కూడా చూడకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మొత్తం కేవలం 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో విధ్వంసం సృష్టించి.. చివర్లో మాత్రం నిరాశగానే వెనుదిరగాడు.

అదేంటి అంత అద్భుతంగా ఆడి చివర్లో నిరాశ ఎందుకంటే.. ఒక్క పరుగు దూరంలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 49 పరుగుల వద్ద ప్రత్యర్థి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అందుకున్న సూపర్ క్యాచ్‌తో అభిషేక్ తుపాన్‌కు అడ్డుకట్ట పడింది. మొత్తంగా 15 బంతుల్లో 49 పరుగులు చేసిన అభిషేక్ బౌలింగ్‌‌లో ఆకట్టుకున్నాడు. ఏకంగా రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో బ్యాట్, బాల్‌తో అదరగొట్టినందుకు అభిషేక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాజిల్కా ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 67 పరుగులు చేశారు. ప్రన్షూ ప్రతాప్, సన్వీర్ సింగ్ చెరో 40 పరుగులతో రాణించారు. ఇక 192 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన అమృత్‌సర్ సూర్మాస్ 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి, 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ 49, ఓపెనర్ ధావన్ 37, రాహుల్ కుమార్ 53 పరుగులతో రాణించడంతో టార్గెట్ ఈజీ అయింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి