
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మహోత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనివాసరావు ఆలయ అధికారులు, అర్చక సిబ్బందితో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఉత్సవాల కాలంలో క్షేత్రానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
నవరాత్రుల సందర్భంగా శ్రీ భ్రమరాంబికాదేవికి నిర్వహించే నవదుర్గ అలంకరణలు, వివిధ వాహనసేవలు, శమీపూజ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించేలా అర్చక బృందంతో సమీక్షించారు. అలాగే క్షేత్రానికి వచ్చే భక్తులకు సులభంగా దర్శనం లభించేలా క్యూలైన్ల నిర్వహణ, వాహనాల పార్కింగ్ వసతులు, ఇతర ప్రాథమిక సౌకర్యాల కల్పనపై అధికారులకు ఈవో పలు మార్గదర్శకాలు చేశారు. ఉత్సవ విశేషాలను మరియు అమ్మవారి సేవలను ఆలయ ప్రాంగణంతో పాటు ప్రముఖ ప్రదేశాలలో భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
దేవస్థానంలో పనిచేసే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించేలా సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించనున్నారు. అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ దసరా ఏర్పాట్లన్నింటినీ ఎక్కడా లోపాలు లేకుండా పగడ్బందీగా పూర్తి చేయాలని ఈవో సూచించారు. ఉత్సవాల సమగ్ర ప్రణాళిక , తుది ఏర్పాట్లపై త్వరలో జరగనున్న ట్రస్ట్ బోర్డు సమావేశంలో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. భక్తులందరికీ క్షేమకరమైన, తృప్తికరమైన దర్శన భాగ్యం కల్పించడమే ధ్యేయంగా దేవస్థాన యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు.