Reading Time: 2 minutes
Big Bash League Privatisation Why Ipl Owners Are Excited

Big Bash League (BBL) Privatisation: ఆస్ట్రేలియా క్రికెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 టోర్నీ బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లోకి ప్రైవేట్ పెట్టుబడులకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతి ఇచ్చింది. 2027-28 సీజన్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఫ్రాంచైజీని తొలిసారిగా 100 శాతం ప్రైవేట్ యాజమాన్యానికి విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రపంచంలోని ప్రధాన క్రికెట్ మార్కెట్లలో ప్రైవేట్ పెట్టుబడులకు దూరంగా ఉన్న ప్రముఖ టీ20 లీగ్‌గా బీబీఎల్‌ కొనసాగింది. ఇప్పుడు సీఏ నిర్ణయంతో ప్రైవేటీకరణ అయింది. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీమ్ ఓనర్లకు పండగే అనే చెప్పాలి.

ఐపీఎల్ టీమ్ ఓనర్లకు భారీ మార్కెట్:

ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు ఇప్పటికే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, యూఏఈ, అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో జరిగే టీ20 లీగ్‌ల్లో ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు బీబీఎల్‌లోకి కూడా ప్రైవేట్ పెట్టుబడులకు తలుపులు తెరవడంతో.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు మరో భారీ మార్కెట్ అందుబాటులోకి వచ్చినట్లైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆర్‌పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్, జీఎంఆర్-జేఎస్‌డబ్ల్యూ వంటి సంస్థలు ఇప్పటికే ప్రపంచంలోని వివిధ టీ20 లీగ్‌ల్లో ఫ్రాంచైజీలను కలిగి ఉన్నాయి. బీబీఎల్‌లో ఓ జట్టును సొంతం చేసుకుంటే.. ఒకే బ్రాండ్ కింద ఆటగాళ్లతో ఏడాది పొడవునా పలు టీ20 టోర్నీలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం లభిస్తుంది.

భారత స్టార్లు ఆడరు:
ఉదాహరణగా చెప్పాలంటే.. కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి స్టార్ ఆటగాళ్లను ఒకే యాజమాన్యంలోని ఐపీఎల్, ఎస్‌ఏ20, ఎంఎల్‌సీ, బీబీఎల్ జట్లలో కొనసాగించే అవకాశం ఏర్పడుతుంది. దీంతో ఫ్రాంచైజీ యజమానులు తమ ఆటగాళ్లపై మరింత దృష్టి పెట్టడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తమ బ్రాండ్‌ను విస్తరించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీబీఎల్ జట్టును కొనుగోలు చేసినంత మాత్రాన భారత స్టార్ ఆటగాళ్లను ఆస్ట్రేలియాలో ఆడించగలగడం సాధ్యం కాదు. ప్రస్తుతం బీసీసీఐ భారత ఆటగాళ్లను విదేశీ టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతించడం లేదు. దీంతో బీబీఎల్‌లో భారత క్రికెటర్ల భాగస్వామ్యం విషయంలో తక్షణ మార్పులు వచ్చే అవకాశం లేదు.

అంతర్గత పోటీ తప్పదు:
ప్రస్తుతం బీబీఎల్ సీజన్ డిసెంబర్-జనవరి మధ్య జరుగుతుంది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా ఎస్‌ఏ20, యూఏఈ ఐఎల్‌టీ20 లీగ్‌లు కూడా జరుగుతాయి. ఒకే యాజమాన్యానికి చెందిన ఫ్రాంచైజీలు పలు లీగ్‌ల్లో ఉంటే.. స్టార్ విదేశీ ఆటగాళ్లను ఏ జట్టుకు కేటాయించాలనే విషయంలో అంతర్గత పోటీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు తమ జట్లలో భారత పురుషుల క్రికెటర్లను ఇప్పటివరకు తీసుకురాలేకపోయారు. అయితే భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి వారు ఇప్పటికే బీబీఎల్‌లో ఆడుతున్నారు.

అనుమతులు సడలిస్తే:
భారత స్టార్ ఆటగాళ్లను వెంటనే బీబీఎల్‌లోకి తీసుకురాలేకపోయినా.. ఆస్ట్రేలియా మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా ఐపీఎల్ యాజమాన్యాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలగవచ్చని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువ ఆస్ట్రేలియా ప్రతిభను గుర్తించి.. తమ అంతర్జాతీయ అకాడమీ నెట్‌వర్క్ ద్వారా అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుంది. భవిష్యత్తులో బీసీసీఐ నాన్-కాంట్రాక్ట్ లేదా రిటైర్డ్ భారత ఆటగాళ్లకు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతులు సడలిస్తే.. బీబీఎల్‌లో పెట్టుబడులు పెట్టిన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మరింత పెద్ద ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

కఠిన నియంత్రణలో ప్రైవేటీకరణ:
ఇతర ప్రైవేట్ యాజమాన్య టీ20 లీగ్‌ల మాదిరిగా బీబీఎల్‌ను పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి వదిలేయకుండా.. క్రికెట్ ఆస్ట్రేలియా నియంత్రణ కొనసాగించనుంది. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్, ఆటగాళ్ల లభ్యత, ప్రసార హక్కులు, జీతాల పరిమితి వంటి కీలక అంశాలపై బోర్డు నియంత్రణ కొనసాగుతుంది. అంతేకాకుండా ఫ్రాంచైజీలను కొనుగోలు చేయబోయే సంస్థలను ఆమోదించే లేదా తిరస్కరించే అధికారం కూడా క్రికెట్ ఆస్ట్రేలియాకే ఉంటుంది. ఐపీఎల్‌కు చెందిన భారత సంస్థలు బీబీఎల్‌లో ఎన్ని జట్లను కొనుగోలు చేయవచ్చనే విషయంలోనూ పరిమితులు ఉండే అవకాశం ఉంది. యాజమాన్య వైవిధ్యాన్ని కొనసాగించేందుకు భారత సంస్థలకు రెండు లేదా మూడు ఫ్రాంచైజీలకు మించి అవకాశం ఇవ్వకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.