
ఢిల్లీ జంతర్మంతర్లో జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించి గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి చెందిన రెండో సంవత్సరం విద్యార్థికి నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులపై ఎలాంటి బలవంతపు లేదా శిక్షాత్మక చర్యలు తీసుకోవద్దని సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు జారీ చేయడాన్ని కోర్టు ప్రశ్నించింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ విషయాన్ని విచారించింది. నోయిడా పోలీసుల సమాచారం ఆధారంగా ఓ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విద్యార్థికి నోటీసులు జారీ చేసినట్లు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జంతర్మంతర్లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నిరసనలో ఇతర విద్యార్థులు పాల్గొనాలని ఆ విద్యార్థి ప్రోత్సహించినట్లు నోటీసులో పేర్కొన్నట్లు తెలిపారు.
“మా ఆదేశాలను ఎలా ఉల్లంఘించారు?”
ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “బలవంతపు చర్యలు తీసుకోవద్దని మేము ఆదేశించినప్పటికీ ఇది ఎలా జరిగింది?” మండిపడ్డారు. అంతేకాకుండా “మేము ఏ విద్యార్థిపైనా బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా చెప్పాం. ఏ మేజిస్ట్రేట్ కూడా ఆ ఆదేశాలను ఉల్లంఘించలేరు. ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోకూడదని చెప్పాం. అలాంటప్పుడు మేజిస్ట్రేట్ నోటీసు ఎలా జారీ చేయగలరు? మా ఆదేశాల్లోని భాష చాలా స్పష్టంగా ఉంది” అని సీజేఐ వ్యాఖ్యానించారు.
నోటీసు ఉపసంహరణపై స్పష్టత కోరిన జస్టిస్ బాగ్చి
నోటీసును గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా యంత్రాంగం అమలు చేయాల్సి ఉండగా అనంతరం దానిని ఉపసంహరించుకున్నట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఈ వ్యవహారం కేవలం ఒక విద్యార్థికి సంబంధించిన అంశం కాదని.. దేశవ్యాప్తంగా విద్యార్థులపై ప్రభావం చూపే అంశమని న్యాయవాది పేర్కొన్నారు. “ఇది భారతదేశంలోని విద్యార్థులతో జరుగుతున్న ఒక ప్రయోగం. అందువల్ల దీనికి దేశవ్యాప్త ప్రాధాన్యం ఉంది” అని అన్నారు. దీనిపై జస్టిస్ బాగ్చి నోటీసు అధికారికంగా ఉపసంహరించుకున్నారా అని ప్రశ్నించారు. “నోటీసు ఉపసంహరించుకున్నారని మీరు చెబుతున్నారు. ప్రస్తుతం అది ఉపసంహరించుకున్నట్లు చెబుతున్నారు. నోటీసు ఉపసంహరణపై మీకు అధికారికంగా ఏదైనా సమాచారం అందిందా?” అని నిలదీశారు. దానికి న్యాయవాది స్పందిస్తూ.. తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని.. మీడియా కథనాల ఆధారంగానే నోటీసు ఉపసంహరణ విషయం తెలిసిందని తెలిపారు.
“కోర్టు ధిక్కారం ఎలా జరిగింది?”
“మీ తీర్పు సెప్టెంబర్ 1న వెలువడింది. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటప్పుడు కోర్టు ఆదేశాలను ఎలా ఉల్లంఘించగలిగారు? కోర్టు ధిక్కారం ఎలా జరిగింది?” అని న్యాయవాది ప్రశ్నించారు. ఈ వాదనలు సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జరిగాయి. విద్యార్థుల నిరసనలకు సంబంధించి వారిపై ఎలాంటి బలవంతపు లేదా శిక్షాత్మక చర్యలు తీసుకోరాదని అప్పట్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత ఘటనలో ఆ ఆదేశాలను పక్కనపెట్టి విద్యార్థికి నోటీసు జారీ చేయడంపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.