
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-Inservice Teachers-2026) కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పాఠశాల విద్య శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మొత్తం మూడు సెషన్లలో ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.
ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,986 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 22,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం మీద 89.96 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ కారణాల వల్ల 2,509 మంది ఉపాధ్యాయులు పరీక్షకు గైర్హాజరయ్యారని విద్యాశాఖ పేర్కొంది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
పరీక్షలు పూర్తి కావడంతో అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 15, 2026న అధికారిక వెబ్సైట్లో ‘ప్రాథమిక కీ’ ని విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ సమాధానాలను ఈ కీ ద్వారా సరిచూసుకోవచ్చు.
ప్రాథమిక కీ పై ఏవైనా అభ్యంతరాలు లేదా ప్రశ్నలపై సందేహాలు ఉంటే, వాటిని నమోదు చేసుకోవడానికి విద్యాశాఖ అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆన్లైన్ విధానంలో తమ అభ్యంతరాలను ఆధారాలతో సహా సమర్పించవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది కీ, అలాగే ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలు, అభ్యంతరాల నమోదు కోసం అధికారిక వెబ్సైట్ https://www.schooledu.telangana.gov.in ను సందర్శించవచ్చు.