
KL Rahul Play With Delhi Capitals for IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 మినీ వేలానికి ముందే టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) నుంచి రాహుల్ ట్రేడ్ అవుతాడంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తాజాగా పోస్టుతో ఈ రూమర్లకు తెరపడినట్లైంది. వచ్చే సీజన్లోనూ డీసీ తరఫునే బరిలోకి దిగనున్నట్లు రాహుల్ స్పష్టం చేశాడు. రాహుల్ స్వయంగా స్పందించడంతో ఢిల్లీ అభిమానులు సంబరపడిపోతున్నారు.
కేఎల్ రాహుల్ను ప్రశంసిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. రాహుల్ను ‘క్లచ్ ప్లేయర్’గా అభివర్ణించిన ఆయన.. ఢిల్లీ జట్టులో ఇంకా పూర్తి చేయాల్సిన పని చాలానే ఉందని పేర్కొన్నారు. జట్టును తనకంటే ముందు ఉంచే వ్యక్తిగా రాహుల్ను కొనియాడారు. ‘డీసీలో కేఎల్ రాహుల్ కీలక ఆటగాడు. నాకు తెలిసిన అత్యంత మంచి వ్యక్తుల్లో అతడు ఒకడు. ఎప్పుడూ తనకంటే జట్టుకే ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. మా లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ గర్వకారణంగా నిలిచేలా మేమిద్దరం కలిసి కష్టపడి పనిచేస్తాం’ అని పార్థ్ జిందాల్ పేర్కొన్నారు.
పార్థ్ జిందాల్ పోస్ట్కు కేఎల్ రాహుల్ స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ.. రాబోయే సీజన్ కోసం వేచి చూస్తున్నా’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఐపీఎల్ 2027 సీజన్లోనూ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలోనే కనిపించనున్నాడనే విషయం స్పష్టమైంది. ఐపీఎల్ 2025కి ముందు ఢిల్లీ రాహుల్ను రూ.14 కోట్లకు తీసుకుంది. రెండు సీజన్లలోనూ నిలకడైన ప్రదర్శన చేశాడు. 2025లో 539 పరుగులు చేసిన రాహుల్.. 2026 సీజన్లో 593 పరుగులతో రాణించాడు. ఢిల్లీకి రాకముందు రాహుల్ పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్కు మూడు సీజన్ల పాటు నాయకత్వం వహించాడు. ఇప్పుడు ఢిల్లీతో ఆటగాడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.
Thank you , can’t wait for the coming season .
https://t.co/loH9FUXylq
— K L Rahul (@klrahul) September 7, 2026