Reading Time: 2 minutes
Ys Jagan Padayatra 2 0 Key Update On September October 2027

Key Update on YS Jagan Padayatra 2.0: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. పర్చూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో జరిగిన సమావేశంలో ‘పాదయాత్ర 2.0’పై జగన్ ప్రస్తావించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రకటనతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గతంలో జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రారంభమైన యాత్ర.. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. దాదాపు 16 నెలల పాటు సాగిన ఈ పాదయాత్రలో జగన్ సుమారు 3,648 కిలోమీటర్లు నడిచారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ రాష్ట్రంలోని 13 జిల్లాలు, 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల్లో పర్యటించారు. రోజుకు సగటున 12 నుంచి 20 కిలోమీటర్ల మేర నడుస్తూ వివిధ వర్గాల ప్రజలను కలిశారు. రైతులు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు, అంగన్‌వాడీ సిబ్బంది, నిరుద్యోగ యువతతో పాటు వివిధ సామాజిక వర్గాల ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడారు. యాత్రలో 500, 1,000, 2,000, 3,000 కిలోమీటర్ల మైలురాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్‌పై కోడికత్తితో దాడి జరిగిన ఘటన కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన అనంతరం పాదయాత్రకు కొంతకాలం విరామం ఏర్పడింది.

ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యల ఆధారంగా వైసీపీ ‘నవరత్నాలు’ హామీలను రూపొందించింది. రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలు ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారాయి. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో 91 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ పాదయాత్ర అనంతరం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. దీంతో జగన్ రాజకీయ ప్రస్థానంలో ప్రజా సంకల్ప యాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు మరోసారి పాదయాత్రకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారన్న వార్త వైసీపీ శ్రేణుల్లో ఆసక్తిని పెంచుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ‘పాదయాత్ర 2.0’ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న సంకేతాలతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.