Reading Time: 2 minutes
Sushmita Konidela: దుర్గగుడి ట్రస్ట్ బోర్డులో చోటు.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సుస్మిత కొణిదెల

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెలకు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం బోర్డులో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఆమెను ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం (సెప్టెంబర్ 08) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో బెజవాడ దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఏపీ ప్రభుత్వం తనను నియమించడంపై మెగా డాటర్ సుస్మిత స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు నన్ను ‘ప్రత్యేక ఆహ్వానితురాలి’గా నామినేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై నమ్మకం ఉంచిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ దైవిక బాధ్యతను నేను వినమ్రతతో స్వీకరిస్తున్నాను. అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గా అమ్మవారికి సేవ చేయడానికి, ఆలయ కార్యకలాపాలలో నా వంతు కృషి చేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. శ్రీ మాత్రే నమః’ అని సుస్మిత కొణిదెల ఎక్స్(ట్విట్టర్) లో పేర్కొన్నారు.

కాగా సుస్మితకు దుర్గ గుడి ట్రస్టు బోర్డులో కీలక బాధ్యతలు ఇవ్వడంపై ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ – సుస్మిత కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన ఆయన.. ‘విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమితులైన మా మెగా డాటర్ శ్రీమతి సుష్మిత కొణిదెల గారికి హృదయపూర్వక అభినందనలు. అమ్మవారి ఆశీస్సులతో మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, మీ సేవలతో మరింత మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాను’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

సుస్మిత కొణిదెల ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.