Reading Time: < 1 minute
Telangana Assembly: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. తాతా మధు వ్యాఖ్యలపై సభలో కీలక చర్చ..

తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. తొలిరోజు అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ సభ్యులు నల్ల చొక్కాలు వేసుకుని రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఉదయమే పోలీసులు తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వారిని నారాయణగూడ పీఎస్‌కు తరలించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అరెస్ట్ సమయంలో పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

స్పీకర్ చైర్‌ను, అందునా దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడిన తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని అధికార పక్షం పట్టుబడుతుంది. నిన్నటి పరిణామాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం సభలో సభ్యుల వివరణ తీసుకోనున్నారు. మరోవైపు సభకు ప్రతిపక్షం రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నల్లబ్యాడ్జిలతో వారు అసెంబ్లీకి హాజరయ్యారు.