
త్వరలో దేశంలో వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు రానున్నాయి. ఈ కీలక పండుగల వేళ సహజంగానే విపరీతమైన రద్దీ ఉంటుంది. దీంతో ఈ అవకాశాన్ని విమాన సంస్థలు క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా ధరలు పెంచేశాయి. కొన్ని రూట్లలో అయితే దారుణాతీదారుణంగా పెంచేశాయి. ఒక్కసారిగా ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలతో జేబులు ఖాళీ అయ్యేటట్టు కనిపిస్తున్నాయి.
దేశీయ విమాన ప్రయాణికులకు పండుగల సీజన్లో షాక్ తగులుతోంది. దీపావళి, వినాకయ చవితి, దుర్గాపూజ వంటి పండుగల నేపథ్యంలో విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఒకే విమానయాన సంస్థ సర్వీసులు అందించే రూట్లలో ధరలు మరింత వేగంగా పెరిగినట్లు ట్రావెల్ మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి. సీట్ల లభ్యత తగ్గిపోవడం, డిమాండ్ భారీగా పెరగడం, పరిమిత విమాన సామర్థ్యం కారణంగా కొన్ని మార్గాల్లో టికెట్ ధరలు సాధారణ ధరలతో పోలిస్తే 50 శాతం నుంచి 150 శాతానికి పైగా పెరిగాయి.
ఢిల్లీ-పాట్నా టికెట్ రూ.12,500 దాటింది
దీపావళి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు పెద్ద ఎత్తున విమాన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో ఢిల్లీ-పాట్నా వంటి అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో ఈ రూట్లో నాన్స్టాప్ ఎకానమీ టికెట్ ధర సుమారు రూ.3,500-4,500 మధ్య ఉంటుంది. అయితే పీక్ డేట్లలో ఇదే టికెట్ ధర రూ.12,500కు పైగా చేరింది. చివరి నిమిషంలో బుక్ చేసుకునే నాన్స్టాప్ టికెట్ల ధర రూ.13,500 దాటుతున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రూట్లలో 200-300శాతానికిపైగా పెంపు
ఒకే ఎయిర్లైన్కు ప్రత్యేకంగా ఉన్న కొన్ని ప్రాంతీయ రూట్లలో ధరల పెరుగుదల మరింత తీవ్రంగా ఉంది. దుర్గాపూజ సందర్భంగా కోల్కతా-దియోఘర్ నాన్స్టాప్ విమాన టికెట్ సాధారణంగా రూ.2,800 దగ్గర ఉండగా.. పీక్ సీజన్లో అది రూ.12,500కు చేరింది. అంటే దాదాపు 340 శాతం పెరిగింది. అలాగే ఢిల్లీ-అగట్టి (లక్షద్వీప్) రూట్లో సాధారణంగా రూ.8,500గా ఉండే టికెట్ ధర పీక్ అక్టోబర్ సెలవుల్లో రూ.25,000కు చేరింది. ఇది సుమారు 194 శాతం పెరుగుదల. దీపావళి సమయంలో బెంగళూరు-ఝార్సుగూడ నాన్స్టాప్ టికెట్ల ధర సాధారణంగా రూ.4,200 ఉండగా.. ప్రస్తుతం రూ.16,200కు చేరింది. అంటే దాదాపు 285 శాతం పెరిగింది.
ముంబై-బరేలీ మార్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణ ధర రూ.4,500 నుంచి రూ.15,000కు పైగా పెరిగింది. నేరుగా పోటీ చేసే విమాన సర్వీసులు పరిమితంగా ఉండటం, డైనమిక్ ప్రైసింగ్ కారణంగా ధరలు భారీగా పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఢిల్లీ-కోల్కతా టికెట్ కూడా భారీగా పెరిగింది
ఢిల్లీ-కోల్కతా నాన్స్టాప్ విమాన టికెట్ల ధరలు సాధారణ రోజుల్లో రూ.4,800 వరకు ఉండగా.. పీక్ సీజన్లో రూ.12,300కు పైగా చేరాయి. ఇక ఢిల్లీ-బెంగళూరు వంటి ప్రధాన రూట్లలో టికెట్ ధరలు సుమారు రూ.10,000కు చేరాయి. ఢిల్లీ-ముంబై మార్గంలో ధరలు సుమారు రూ.7,000 దగ్గర ఉన్నాయి. అయితే బెంగళూరు, ముంబై వంటి అత్యంత రద్దీ మార్గాల్లో ధరల పెరుగుదల ఇతర ప్రాంతీయ రూట్లతో పోలిస్తే తక్కువగా ఉంది. బెంగళూరు రూట్లో సుమారు 15 శాతం, ముంబై రూట్లో 11 శాతం మేర ధరల పెరుగుదల నమోదైనట్లు తెలుస్తోంది.
ముంబై-కోల్కతా రూట్లోనూ ఇదే పరిస్థితి
దుర్గాపూజ పీక్ రోజుల్లో ముంబై-కోల్కతా విమాన టికెట్ల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో నాన్స్టాప్ ఎకానమీ టికెట్ ధర రూ.5,000-6,500 మధ్య ఉంటుంది. అయితే మహాలయ నుంచి మహా షష్ఠి, మహా సప్తమి వరకు పూజా రోజుల్లో ఇదే టికెట్ ధర రూ.11,500 నుంచి రూ.14,200 వరకు చేరింది. అంటే సాధారణ ధరలతో పోలిస్తే సుమారు 100-135 శాతం పెరుగుదల నమోదైంది.
సీట్లు తగ్గుతున్న కొద్దీ..
ప్రధాన విమానయాన సంస్థలు ఉపయోగించే డైనమిక్ ప్రైసింగ్ విధానం కారణంగా సీట్ల లభ్యత తగ్గుతున్న కొద్దీ టికెట్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ట్రావెల్ ప్లాట్ఫామ్ల ప్రకారం.. అధిక రద్దీ ఉన్న మార్గాల్లో వన్వే నాన్స్టాప్ ఎకానమీ టికెట్లు సాధారణ ధరలతో పోలిస్తే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా విక్రయమవుతున్నాయి.
విమానాల కొరత కూడా కారణమే!
పండుగల సమయంలో ప్రయాణ డిమాండ్ పెరగడంతో పాటు విమానాల లభ్యత పరిమితంగా ఉండటం కూడా టికెట్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. విమానయాన సంస్థలు ప్రస్తుతం ఇంజిన్ నిర్వహణ కారణంగా విమానాల గ్రౌండింగ్, కొత్త విమానాల డెలివరీలో ఆలస్యం, నిర్వహణ పరిమితులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే ప్రయాణికుల నుంచి డిమాండ్ బలంగా ఉండటంతో.. అధిక ఇంధన, నిర్వహణ ఖర్చులను విమానయాన సంస్థలు టికెట్ ధరల రూపంలో ప్రయాణికులపైకి బదిలీ చేస్తున్నాయి.
ATF ధర కూడా పెరిగింది
దేశీయ విమానయాన సంస్థలకు మరోసారి ఇంధన ధరల భారం పెరిగింది. సెప్టెంబర్ 1న ATF ధరను 5.46 శాతం, అంటే లీటరుకు రూ.6.28 మేర పెంచారు. దీంతో ATF ధర లీటరుకు రూ.115 నుంచి రూ.121.28కు చేరింది. వరుసగా రెండో నెలలో ATF ధరలు పెరగడం గమనార్హం. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయాల్లో ATF వాటా సుమారు 35-40 శాతం ఉంటుంది. అందువల్ల ఇంధన ధరల పెరుగుదల నేరుగా విమాన టికెట్ ధరలు, ఎయిర్లైన్స్ లాభదాయకతపై ప్రభావం చూపుతుంది.
పండుగల తర్వాతే ధరలు తగ్గే అవకాశం
దేశీయ విమానాల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేట్లు ప్రస్తుతం ప్రధాన విమానాల ఫ్లీట్లలో 85 శాతానికి పైగా కొనసాగుతున్నాయి. దీంతో పండుగల సీజన్ ముగిసే వరకు విమాన టికెట్ ధరలు అధికంగానే ఉండే అవకాశం ఉందని ముంబైకి చెందిన ఓ టూర్ ఆపరేటర్ తెలిపారు. పండుగల తర్వాత వారాంతపు రద్దీ తగ్గిన సమయంలోనే విమాన చార్జీల్లో కొంత ఉపశమనం కనిపించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.