Reading Time: < 1 minute
500 మీటర్ల దూరంలో ఉన్న కిచ్చా నది.. చూస్తుండగానే ట్యాంక్‌నే మింగేసింది!

బరేలీ: ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, నదుల ఉధృతితో ప్రభుత్వ అభివృద్ధి పనులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బరేలీ జిల్లాలోని షేర్‌గఢ్‌ బ్లాక్‌ పరిధిలో బైరామ్‌నగర్‌ గ్రామ పంచాయతీలో జల్‌ జీవన్‌ మిషన్‌ కింద నిర్మిస్తున్న ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ కిచ్చా నదిలో మునిగిపోయింది. సుమారు రూ.3.97 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ట్యాంక్‌ నదీ కోతకు గురై కూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది.

గత వారం కిచ్చా నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ప్రవాహం ఉధృతమైంది. దీంతో నది ఒడ్డున వేగంగా కోత ప్రారంభమైంది. ట్యాంక్‌ను కాపాడేందుకు నిర్మించిన ప్రహరీ గోడ కూడా నదీ ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆ తర్వాత కోత ఆగకపోవడంతో క్రమంగా ట్యాంక్‌ నిర్మాణ ప్రాంతం వరకు విస్తరించింది. చివరకు ట్యాంక్‌ ఉన్న భూమి కోతకు గురై నిర్మాణం నదిలో పడిపోయింది.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎక్స్‌ఈఎన్‌ ఆకాంక్ష సింగ్‌, ఏఈ సంజయ్‌ సింగ్‌, జేఈ రాకేష్‌ చౌదరి పరిస్థితిని పరిశీలించారు. ట్యాంక్‌ వద్ద ఉన్న సోలార్‌ ప్యానెళ్లు, డీజీ, స్కోడా, జనరేటర్‌ తదితర సామగ్రిని ట్రాక్టర్‌ ట్రాలీల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే నదీ కోత తీవ్రంగా కొనసాగడంతో ట్యాంక్‌ను మాత్రం కాపాడలేకపోయారు. ట్యాంక్‌ నిర్మాణ సమయంలో కిచ్చా నది సుమారు 500 మీటర్ల దూరంలో ఉండేది. గత రెండు, మూడు సంవత్సరాలుగా నదీ కోత కొనసాగడంతో నది క్రమంగా సమీపించింది. ట్యాంక్‌ను రక్షించేందుకు పిచింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సకాలంలో చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా గ్రామంలో పైప్‌లైన్లు వేయడంతో పాటు సుమారు 70 శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేశారు. త్వరలో ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు అందుతుందని ఆశించిన గ్రామస్తులకు ట్యాంక్‌ నదిలో మునగడంతో నిరాశ ఎదురైంది. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక గది మాత్రమే మిగిలి ఉండగా, అది కూడా నదీ కోత ముప్పులో ఉంది. కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రాజెక్టు దెబ్బతినడంతో బాధ్యత, నాణ్యత, ముందస్తు రక్షణ చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..