
సత్య నికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ఘటన క్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి బుల్డోజర్లతో కూల్చివేయాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. రాజధాని నగరంలోని అన్ని పీజీ హాస్టళ్లను తనిఖీ చేసి ఆ తర్వాత కూల్చివేత చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో మున్సిపల్ కార్పొరేషన్కు సీనియర్ అధికారులు అందరూ ఫీల్డ్ లో ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీ సీఎం ఆదేశాలను వెంటనే అమలులోకి తెచ్చారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఆదివారం సత్యనికేతన్ భవనం కూలిన ప్రాంతంలోనే మరో హాస్టల్ భవనం శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం తెల్లవారు జామున విద్యార్థులను ఖాళీ చేయించి కూల్చివేతలు ప్రారంభించారు.
ప్రజాభద్రత దృష్ట్యా శిథిలావస్థలో ఉన్న, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఎంసీడీనీ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి విద్యార్థులు, స్థానికులను ఖాళీ చేయిస్తున్నారు.
ఇదిలా ఉంటే..సత్య నికేతన్ హాస్టల్ భవనం కూలిన దుర్ఘటన కేసులో యజమాని కుటుంబాన్ని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్ యజమానులు హరిరమ్ బన్సల్ , అతని భార్య ఉర్మిలా గుప్తా, మహేష్ గుప్తాలను అదుపులోకి తీసుకున్నారు. వారిని 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి పంపారు.
Delhi Chief Minister Rekha Gupta directs the MCD to use bulldozers against illegal structures. Action to be taken in several areas of Delhi today. All senior municipal corporation officials have been instructed to be present on the ground.
She issued the directive, “Conduct…
— ANI (@ANI) September 9, 2026
ఆదివారం జరిగిన సత్యనికేతన్ హాస్టల్ బిల్డింగ్ కూలిన ఘటనలో ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు భవనం కూలిన ఈ భవనంలో హాస్టల్ డేజ్ అనే పేరుతో హాస్టల్ ను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. భవనం కూలిన సమయంలో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.