Reading Time: < 1 minute
నేపాల్‌ విధ్వంసం: 17వ శతాబ్దపు శోకసంద్రం..సతీదేవి శాపమే నేటి విపత్తులకు కారణమా?

ప్రకృతి అందాలకు నిలయమైన నేపాల్ ప్రస్తుతం వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర అస్తవ్యస్తంగా మారింది. వేలాది మంది ప్రజలు ఇళ్లు లేక, బురదలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాల వెనుక ఒక నాటి ఘోరమైన చారిత్రక శోకం, సతీదేవి శాపం దాగి ఉందనే ప్రచారం నేపాల్‌లో మళ్లీ ముమ్మరమైంది. నేపాల్‌లో సతి లే సర్పే కో దేశ్ (సతి శాపానికి గురైన దేశం) అనే సామెత బాగా ప్రాచుర్యంలో ఉంది.

17వ శతాబ్దంలో నేపాల్‌ను లక్ష్మీ నరసింహ మల్ల రాజు పాలిస్తుండేవాడు. ఆ సమయంలో కాజీ భీమ్ మల్ల అత్యంత శూరుడైన దళపతిగా, వ్యాపారవేత్తగా నేపాల్ రాజ్య పురోగతికి, టిబెట్‌లో ప్రాభవాన్ని విస్తరించడానికి ఎంతగానో కృషి చేశాడు. అయితే, అతడి ఎదుగుదల, ప్రజాదరణను చూసి ఓర్వలేని ఆస్థాన శత్రువులు రాజు మనస్సులో విషం నింపారు. కాజీ భీమ్ సింహాసనాన్ని కైవసం చేసుకోవడానికి కుట్ర పన్నుతున్నాడని నమ్మించారు. నిజానిజాలు విచారించకుండానే రాజు కాజీ భీమ్‌కు ఉరిశిక్ష విధించాడు.

భర్త అన్యాయంగా హత్యకు గురయ్యాడని తెలుసుకున్న కాజీ భీమ్ భార్య తీవ్రమైన దుఃఖంతో, ఆక్రోశంతో భర్త శవంపై సతీసహగమనం చేసింది. చితెక్కే సమయంలో ఆ సాధ్వి నేపాల్ దేశాన్ని ఉద్దేశించి ఘోరమైన శాపాన్ని ఇచ్చింది. ఈ అధర్మ భూమిపై జీవించే ఏ నమ్మకస్తుడికి, బుద్ధిమంతుడికి ప్రశాంతత లేదా సంతోషం దక్కవు. ఇక్కడి పాలకులకు సరైన జ్ఞానం, బుద్ధి కలగవు అని శపించింది. ఆ తర్వాత భీమ్ మల్ల నిరంకుశుడని తేలడంతో రాజు తీవ్ర పశ్చాత్తాపపడినప్పటికీ, సమయం మించిపోయింది.

నేటి పరిస్థితులకు ఆ శాపానికి లింక్?:

నాటి సతీదేవి శాప ప్రభావం నేటికీ నీడలా నేపాల్‌ను వెంటాడుతోందని స్థానిక పెద్దలు నమ్ముతుంటారు. ప్రకృతి సౌందర్యం ఉన్నప్పటికీ నేపాల్ నిరంతరం రాజకీయ అస్థిరత, అవినీతి, సామాజిక అశాంతి, వరదలు, భూకంపాల వంటి వరుస ప్రకృతి విపత్తులతో నలిగిపోతోంది. నేడు జరుగుతున్న భయానక వరదలు, ప్రాణనష్టం చూస్తుంటే నాటి సతీదేవి శాపం మళ్లీ గుర్తుకొస్తోందని నేపాల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(Disclaimer: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడింది. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..