
Siddipet District: సిద్దిపేట జిల్లా దామరకుంట దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కేసీఆర్ ఫామ్హౌస్కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై బీఆర్ఎస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల సైతం కలుగజేసుకోవడంతో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎర్రవల్లికి బయలుదేరారు.
మరోవైపు.. ఈ అంశంపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రసంగించారు. “పిరికితనంతో ప్రభుత్వం ఇలా వ్యవహారం చేస్తోంది. అసెంబ్లీకి రాకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. అసెంబ్లీలో చర్చలు జరపడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉసిగొల్పి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పంపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండి కాంగ్రెస్ వాళ్ళను ఫామ్ హౌస్కు పంపుతున్నారు. పోలీసు ఎస్కార్ట్లు ఇచ్చి కేసీఆర్ ఇంటికి వద్దకు పంపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారు. పై స్థాయి నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారు. రేవంత్ రెడ్డికి ఇవి కొత్త కావచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళ కాళ్ళు పెట్టుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటు. కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్తున్న వారిని అరెస్టు చేస్తారా లేదా? జంగిల్ బ్యాచ్ పోలీసులను తీసుకువచ్చి మాపైన దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికి దెబ్బలు తగిలాయి. మేము దేనికి భయపడటం లేదు. జరిగిన సంఘటనకు ప్రభుత్వం భాద్యత వహించాలి. కేసీఆర్ను చంపడానికి వచ్చామని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన వారిని అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి బాసుల నుంచి కేసీఆర్ను తెలంగాణ ప్రజలు కాపాడుకున్నారు. కేసీఆర్ను కాపాడుకోవడానికి ఫామ్ హౌస్కు వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలి.” అని డిమాండ్ చేశారు.