
రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షల మధ్య ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక భేటీ కానున్నారు. మరో మూడు రోజుల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సమావేశాల్లో ఈ భేటీ ఉంటుందని రష్యా అధికారికంగా ప్రకటించింది. ఈ ద్వైపాక్షిక చర్చల్లో సుకోయ్ యుద్ద విమానాలు, వాణిజ్యం, ఆర్థికపరమైన ప్రధానఎజెండాగా రెండు దేశాల నేతలు చర్చలు జరపనున్నాట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.
సెప్టెంబర్ 11నుంచి న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటిస్తారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మంగళవారం తెలిపారు. 2026 జనవరి 1న బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపట్టిన భారతదేశం..ఇది నాలుగోసారి ఈ కూటమికి అధ్యక్షత వహిస్తోంది.
సుకోయ్ 57 యుద్ద విమానాలు, వాణిజ్యం ఎజెండాగా..
రష్యా, భారత్ ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక విషయాలు చర్చకు రానున్నాయి. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై చర్చలతో పాటు, భారత్కు సుకోయ్ 57 యుద్ద విమానాల విక్రయంపై కూడా చర్చించనున్నట్లు రష్యా వెల్లడించింది. రష్యా చమురు దిగుమతి చేసుకుంటే 100 శాతం పన్నులు తప్పవని అమెరికా హెచ్చరించిన వేళ.. భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అమెరికా ఆంక్షల మధ్య బ్రిక్స్ సదస్సు..
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తు భారీ సుంకాలు తప్పవని అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్న క్రమంలో భారత్ కీలకమైన బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ వంటి పూర్తిస్థాయి సభ్యత్వ దేశాలైన ప్రపంచ దేశాలు పాల్గొంటుండగా.. ఈ కూటమిలో బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్ ,వియత్నాం కూడా భాగస్వామ్య దేశాలు ఉండటంతో ఈ సమావేశాలు కీలకంగా మారాయి.