
డబ్బు సంపాదించడానికి అనేకానేకా మార్గాలు ఉన్నాయి. కానీ, కొంతమంది డబ్బు కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారు. హత్యలు, బెదిరింపులు, దోపిడీ, మోసం, అక్రమాలు వంటివి కూడా చేస్తుంటారు.. అయితే, సరైన మార్గాన్ని అనుసరించి, ఇతరులకు ఉపయోగపడుతూ డబ్బు సంపాదించే వారు కూడా ఉన్నారు. ప్రజల నుండి డబ్బు వసూలు చేయడం తప్పు అన్నది నిజమే. అయితే, ప్రజల అతిపెద్ద చింతలను పరిష్కరించి, వారికి వేల రూపాయలు ఆదా చేసి, కొన్ని రూపాయలు సంపాదించడం ఏ కోణంలోనూ తప్పు కాదు. అటువంటి అరుదైన రైతు కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక గ్రామంలోని ప్రధాన వంతెన హఠాత్తుగా కూలిపోవడంతో అవతలి వైపుకు వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేరే మార్గం లేకపోవడంతో దాదాపు 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వచ్చేది. దీనివల్ల సమయం వృథా కావడమే కాకుండా పెట్రోల్, డీజిలు కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది.
ఈ పరిస్థితిని గమనించిన వంతెన పక్కనే ఉన్న పొలం యజమాని ఓ రైతు ఒక తెలివైన ప్రణాళిక వేశాడు. తన వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని సమం చేసి, మట్టి, రాళ్లతో షార్ట్కట్ రోడ్డు తయారు చేశాడు. వాహనాలు సులభంగా వెళ్లేలా మార్గాన్ని సుగమం చేసిన అనంతరం, దారికి అడ్డంగా ఒక వెదురు కర్రను ఏర్పాటు చేసి హోమ్మేడ్ టోల్ గేట్ సిద్ధం చేశాడు.
ఇలా తన పొలం మీదుగా వెళ్లే ప్రతి వాహనం నుండి ఆ రైతు రూ. 30 టోల్ రుసుముగా వసూలు చేయడం ప్రారంభించాడు. 20 కిలోమీటర్ల ప్రయాణ భారాన్ని, వందల రూపాయల ఇంధన ఖర్చును తప్పించిన ఈ 5 నిమిషాల దారి కోసం రూ. 30 చెల్లించడానికి వాహనదారులు కూడా ఎంతో సంతోషంగా ముందుకు వస్తున్నారు. ఎటువంటి గొడవలు లేకుండా ప్రయాణికులు స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పనిని ఒక రైతు చేసి చూపించాడు, ఎవరికీ హాని చేయకుండా, ఇరు వర్గాలకు లబ్ధి చేకూరేలా చేసిన స్మార్ట్ బిజినెస్ ఐడియా ఇది అంటూ నెటిజన్లు సదరు రైతు తెలివితేటలను విశేషంగా ప్రశంసిస్తున్నారు.