Reading Time: < 1 minute
Dsc Issue Are Shyamala Demands Cbi Inquiry Lokeshi Resignation

Are Shyamala: డీఎస్సీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ పెంచుతుంది.. డీఎస్సీ విషయంలో అన్యాయం జరిగిందంటూ బాధితులు రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నా మంత్రి నారా లోకేష్‌ నుంచి సరైన సమాధానం రావడం లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. డీఎస్సీలో పోస్టింగ్‌ల కోసం కులాలు, మతాలు మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయని శ్యామల పేర్కొన్నారు. ప్రభుత్వం అంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించి ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడికి శిక్ష పడిన తరహా పరిణామాలు ఎదురవుతాయనే భయంతోనే సీబీఐ విచారణకు వెనుకంజ వేస్తున్నారని ఆమె ఆరోపించారు.

తన శాఖకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఎదురైనప్పుడు మంత్రి లోకేష్ మహిళా అధికారుల వెనుక దాక్కుంటున్నారని ఆరె శ్యామల విమర్శించారు. డీఎస్సీకి సంబంధించిన కొన్ని కేసుల్లో లోపాలు, తప్పులు, అనుమానాలు ఉన్నాయని అధికారులే అంగీకరిస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు విజిలెన్స్ విచారణ చేపడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. జూడో సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం క్లీన్‌చిట్ ఇవ్వలేదని చెబుతున్నప్పుడు, సంబంధిత అభ్యర్థులకు ఉద్యోగాలు ఎలా ఇచ్చారని శ్యామల ప్రశ్నించారు. డీఎస్సీ వ్యవహారంలో జరిగిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు అవసరమని డిమాండ్ చేశారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం, మంత్రి లోకేష్ డీఎస్సీ స్కాంతో తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారని ఆరె శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడల్లా పేపర్ లీక్‌లు జరుగుతాయనేది చరిత్ర అని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంలో మంత్రి లోకేష్ తన తప్పులను అంగీకరించి తక్షణమే రాజీనామా చేయాలని ఆరె శ్యామల డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీఎస్సీ వ్యవహారంపై వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల..