Reading Time: < 1 minute
Ap Govt Essential Commodity Price Control Me Marts

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అదుపులోకి తెచ్చి, సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రుల బృందం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికను రూపొందించింది.

ఈ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 115 రైతు బజార్లు, మొబైల్ షాపుల ద్వారా కిలో ఉల్లిపాయలను కేవలం 32 రూపాయలకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 20 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పును కేటాయించేందుకు అంగీకరించిన నేపథ్యంలో, నాదెండ్ల మనోహర్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ కందిపప్పును 20 నుండి 30 శాతం తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే త్వరలోనే పామాయిల్ నూనెను కూడా రీజనబుల్ ధరకే అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ పంపిణీ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,306 చౌక ధరల దుకాణాల (రేషన్ షాపుల) ద్వారా నిర్వహించనున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు పంచదారను కూడా నిరంతరం సరఫరా చేస్తున్నారు.

దీంతో పాటు అక్టోబర్ 1వ తేదీ కల్లా రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ‘మీ మార్ట్’ (Me Mart) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రముఖ సూపర్‌మార్కెట్ ‘డీ మార్ట్’కు దీటుగా ఈ ‘మీ మార్ట్’ల ద్వారా 64 రకాల నిత్యావసర వస్తువులను తక్కువ పరిమాణంలో (స్మాల్ ప్యాకెట్లలో) కూడా సామాన్యులకు తక్కువ ధరలకే లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.