Reading Time: < 1 minute
Vijayawada Liquor Case Satyaprasad Approver Plea Allowed

AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ అక్రమ రవాణా కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ అప్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్‌ను సీఐడీ కోర్టు అనుమతించింది. ఈ నెల 18న సత్యప్రసాద్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఎక్సైజ్ ప్రత్యేక అధికారిగా పనిచేశారు. మరోవైపు.. ఇదే కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చూపించేందుకు సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై సీఐడీ కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 18న కారుమూరి నాగేశ్వరరావును సీఐడీ కోర్టులో హాజరుపరచాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

మరోవైపు లిక్కర్ కేసులో నిందితుడైన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు సిట్ అధికారులు ఆయనను విచారించారు. ఈ విచారణలో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా సహకరించలేదని అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో ఆయనను 200కుపైగా ప్రశ్నలు అడిగినట్లు వెల్లడించారు. కేసులోని అన్ని వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను రాజ్ కేసిరెడ్డి, చాణక్య మాత్రమే నిర్వహించారని ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి సిట్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. షెల్ కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా జరిగిన నగదు లావాదేవీలపై అధికారులు ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిపారు. కస్టడీ పూర్తవడంతో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని న్యాయస్థానంలో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు.