Reading Time: < 1 minute
Rohan Parekh Pmo Case Lawyer Says He Got Offer Letter Id Card

PMO Fake ID Case: ప్రధాని నరేంద్ర మోడీ ముంబై పర్యటనకు ముందు భద్రతా కలకలం ఏర్పడింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరి వద్ద నకిలీ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఐడీ కార్డు, ఒకరి వద్ద తుపాకీ లభ్యం కావడం సంచలనంగా మారింది. అనుమానితుల్లో ఒకరిని రోహన్ పరేఖ్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రోహన్ పరేఖ్ తరపున హాజరైన లాయర్ తన క్లయింట్ మోసపోయి ఉండొచ్చని ముంబై కోర్టులో వాదించారు. కోర్టు విచారణ సందర్భంగా రోహన్‌కు అధికారికంగా కనిపించే ఆఫర్ లెటర్, గుర్తింపు కార్డు, ప్రధాని మోడీ సంతకంతో ఉన్నట్లు చెబుతున్న ఒక లేఖ అందాయని లాయర్ తెలిపారు. ఇదే కాకుండా ప్రధాని కార్యాలయంలో అదనపు కార్యదర్శి పేరుతో ఉన్నట్లు చెబుతున్న ఓ ఈమెయిల్ కూడా రోహన్‌కు వచ్చినట్లు కోర్టుకు వెల్లడించారు.

ఈ పత్రాలు, సంప్రదింపుల కారణంగానే తన క్లయింట్ నిజంగా పీఎంఓకు సంబంధించిన ఉద్యోగం పొందినట్లు నమ్మాడని ఆయన తరుఫు న్యాయవాది వాదించారు. ఎవరో వ్యక్తి రోహన్‌ను మోసం చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే, రోహన్ చెబుతున్నవి నిజాలా? లేదా? , అతడి వద్ద లభించిన ఐడీ కార్డు నిజమైందా.? ఎవరు తయారు చేశారు? దీని వెనక ఎవరున్నారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ముంబై కోర్టు రోహన్ పరేఖ్‌ను సెప్టెంబర్ 11 వరకు పోలీస్ కస్టడీకి పంపింది.