Reading Time: < 1 minute
Bcci Partners With Chatgpt Campa And Sbi Life With Rs 130 Crore Deal

BCCI Partner with ChatGPT: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. టీమిండియా స్వదేశీ క్రికెట్‌ సీజన్‌కు క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్‌, చాట్‌జీపీటీ సంస్థలను అసోసియేట్‌ పార్ట్‌నర్లుగా ప్రకటించింది. రెండు సీజన్ల పాటు ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌తో ప్రారంభమై.. 2028 మార్చి వరకు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. ఈ మూడు భాగస్వామ్యాల ద్వారా బీసీసీఐకి రూ.130 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. గత సైకిల్‌తో పోలిస్తే ఈసారి డీల్‌ విలువ 44 శాతం పెరిగినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో భారత క్రికెట్‌ బ్రాండ్‌ విలువ, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ మరోసారి స్పష్టమైంది.

క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్‌, చాట్‌జీపీటీ మూడు విభిన్న రంగాలకు చెందిన సంస్థలు. పానీయాలు, బీమా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ రంగాలకు చెందిన ఈ బ్రాండ్లతో భాగస్వామ్యం ద్వారా క్రికెట్‌ అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశాలు లభిస్తాయని బీసీసీఐ తెలిపింది. భారత క్రికెట్‌ విస్తృతమైన అభిమాన వర్గాన్ని వ్యాపార సంస్థలు తమ బ్రాండ్‌ ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొంది. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌ ఈ భాగస్వామ్యాలపై సంతోషం వ్యక్తం చేశారు. భారత స్వదేశీ క్రికెట్‌ సీజన్‌ దేశంలో అత్యంత విలువైన, డిమాండ్‌ ఉన్న క్రీడా వేదికల్లో ఒకటిగా కొనసాగుతోందని అన్నారు. క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్‌, చాట్‌జీపీటీ భాగస్వామ్యం భారత క్రికెట్‌ వ్యవస్థకు ఉన్న బలానికి నిదర్శనమని పేర్కొన్నారు.

గత సైకిల్‌తో పోలిస్తే భాగస్వామ్యాల విలువ 44 శాతం పెరగడం ముఖ్యమైన పరిణామమని మిథున్‌ మన్హాస్‌ అన్నారు. భారత క్రికెట్‌తో అనుబంధం ద్వారా లభించే భారీ రీచ్‌, అభిమానుల ఆదరణ, వాణిజ్య అవకాశాలపై ప్రముఖ బ్రాండ్లు ఉంచుతున్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. మూడు సంస్థలు విభిన్నమైన బ్రాండ్‌ లక్ష్యాలతో రావడం ఆసక్తికరంగా ఉందని, వాటితో కలిసి బలమైన భాగస్వామ్యాలను నిర్మించేందుకు ఎదురుచూస్తున్నామని చెప్పారు. బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కూడా ఈ ఒప్పందాలపై స్పందించారు. స్వదేశీ సీజన్‌ భాగస్వామ్యాల విలువ గణనీయంగా పెరగడం.. బీసీసీఐ, టీమిండియాపై బ్రాండ్లకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. రూ.130 కోట్లకు పైగా విలువైన తాజా ఒప్పందాలతో 44 శాతం వృద్ధి సాధించడం భారత క్రికెట్‌కు ఉన్న డిమాండ్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.