
క్రిమినల్ బెదిరింపులు, బ్లాక్మెయిల్ కేసులో అరెస్టైన 59 ఏళ్ల వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఏడు వారాల జైలు జీవితం కారణంగా అతడి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడం, అరెస్టు తర్వాత ఏకంగా 21 కిలోల బరువు తగ్గడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. వైద్య కారణాలతో బెయిల్ మంజూరు చేసింది.
రాధా మోహన్ మిశ్రా అనే వ్యక్తిని జూన్లో అరెస్టు చేశారు. జైలులో ఉన్న సమయంలో తన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నందున వైద్య కారణాలపై బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆయనకు ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అరెస్టు తర్వాత గణనీయంగా బరువు తగ్గారని పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ మిలింద్ జాధవ్ సోమవారం ఈ బెయిల్ పిటిషన్ను విచారించారు. మిశ్రా ఆరోగ్య పరిస్థితి “ప్రమాదకర స్థాయిలో” ఉందని ప్రాథమికంగా స్పష్టమవుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కస్టడీలో ఉన్న సమయంలో మిశ్రాకు వాంతులు, తల తిరగడం, స్పృహ తప్పడం, డీహైడ్రేషన్, తీవ్రమైన అలసట వంటి సమస్యలు ఎదురైనట్లు కోర్టు తెలిపింది. మిశ్రాను జైలులోనే కొనసాగించడం, జైలు ఆసుపత్రిలో ఉంచినా.. అతడి ఆరోగ్యం మరింత క్షీణించి “తిరిగి కోలుకోలేని స్థాయికి” చేరుకునే ప్రమాదం ఉందని హైకోర్టు పేర్కొంది. వైద్య కారణాలను చూపిస్తూ బెయిల్ కోరే అంశాన్ని కొన్నిసార్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని జస్టిస్ జాధవ్ అంగీకరించారు. అయితే బెయిల్ విషయంలో దీర్ఘకాలంగా అమల్లో ఉన్న “బెయిల్ నిబంధన.. జైలు మినహాయింపు” అనే సూత్రాన్ని పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరం
మిశ్రా కొద్ది కాలమే కస్టడీలో ఉన్నప్పటికీ.. జైలు జీవితం అతడి మొత్తం ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిందని కోర్టు పేర్కొంది. అతడికి పునరావాసం, సరైన వైద్య సంరక్షణ, ఆహారంపై నిరంతర పర్యవేక్షణ, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణతో పాటు స్పెషలిస్టు వైద్యుల సలహాలు నిరంతరం అవసరమని కోర్టు అభిప్రాయపడింది.
మిశ్రాపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు మహారాష్ట్రలో అమల్లో ఉన్న మానవ బలి, అమానవీయ, దుష్ట, అఘోరీ ఆచారాలు, చేతబడి నిర్మూలనకు సంబంధించిన చట్టం కింద కేసులు నమోదయ్యాయి. సివిల్ వివాదానికి సంబంధించి మిశ్రా, ఆయన కుటుంబ సభ్యులు తమ పొరుగువారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
2025లో కడుపు శస్త్రచికిత్స
తన బెయిల్ పిటిషన్లో మిశ్రా.. తనకు పలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. 2025లో తనకు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ శస్త్రచికిత్స జరిగిందని, ఇందులో తన కడుపులో సుమారు 80 శాతం తొలగించారని పేర్కొన్నారు. ఆ తర్వాత వైద్యుల సూచనల మేరకు కేవలం ద్రవ లేదా సెమీ లిక్విడ్ ఆహారం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే అరెస్టు అనంతరం ఆ నిర్దేశిత ఆహారాన్ని సరిగ్గా తీసుకోలేకపోయానని.. ఫలితంగా 21 కిలోల బరువు తగ్గానని, ఇది తన ఆరోగ్యానికి ప్రమాదకరమని కోర్టుకు వివరించారు.
మిశ్రాకు ఉన్న అనారోగ్య సమస్యలు ప్రాణాంతకమైనవి కావని, జైలులోనే అతడికి అవసరమైన వైద్యం అందించవచ్చని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే హైకోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. జైళ్లలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాల పరిమితులు, జైళ్లలో అధిక రద్దీ వంటి అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో అతడికి బెయిల్ మంజూరు చేసింది.