Reading Time: 2 minutes
Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

పద్మశ్రీ మురళీ మోహన్ తన సినీ ప్రస్థానం గురించి… అలాగే మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ మొట్టమొదటి సినిమా మనువూరి పాండవులు సమయంలో చిరంజీవిలో తాను గమనించిన అసాధారణ ప్రతిభ గురించి వివరించారు. ఆ చిత్రంలో మురళీ మోహన్ ధర్మరాజుగా నటించగా, చిరంజీవి అర్జునుడి పాత్ర పోషించారు. ప్రసాద్ బాబు భీముడిగా, భానుచందర్ నకులుడిగా నటించారు. ఆ రోజుల్లో మురళీ మోహన్ ఒక పెద్ద స్టార్ కాగా, చిరంజీవి ఇంకా పరిశ్రమలో అప్పుడే అడుగుపెడుతున్న కొత్తవారు. అప్పటికి ఒకరోజు చిరంజీవి తన వద్దకు వచ్చి “అన్నయ్యా, రేప్పొద్దున నాకు కూడా సక్సెస్ అయితే నాకు కూడా ఇలాగే పేరు వస్తదా? నాకు కూడా అందరూ వచ్చి నా దగ్గర ఆటోగ్రాఫ్ లు తీసుకుంటారా?” అని అడిగారని మురళీ మోహన్ తెలిపారు. దానికి స్పందిస్తూ తాను “నీలో ఉన్న టాలెంట్ ని నేను గుర్తించాను. మా అందరికంటే మించిన టాలెంట్ నీకుంది. నీ బాడీలో విపరీతమైన ఈజ్ ఉంది. ఏ మ్యూజిక్ చేసినా డ్యాన్స్ చేసేస్తావ్. ఫ్లెక్సిబిలిటీ ఉంది నీ బాడీలో. తర్వాత నీకు బ్రహ్మాండమైన కన్ను ఉంది. ఆ కంట్లో అవతలాడు భయపడిపోయేంత ఎక్స్‌ప్రెషన్ ఉంది. ఈ విధంగా ఎట్లా చూసుకున్నా నువ్వు రాబోయే రోజుల్లో పెద్ద హీరో అవుతావ్. ఇండస్ట్రీకి మొగుడు అవుతావయ్యా” అని అప్పుడే చెప్పినట్లు వెల్లడించారు. ఇదే విషయం కృష్ణంరాజు గారికి చెప్పినప్పుడు, ఆయన “ఏయ్ మురళీ, వీడు పెద్ద యాక్టర్ అవుతాడు అయ్యా. కన్ను చూసావా, మంచి విలన్ అవుతాడు” అని అన్నారు. అయితే తాను మాత్రం చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడు అవుతాడని గట్టిగా నమ్మానని మురళీ మోహన్ స్పష్టం చేశారు. అది నిజమైందని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

చిరంజీవి మొదటి నుండి ఇప్పటి వరకు అదే మాట, అదే పద్ధతి, అదే మర్యాదను పాటిస్తున్నారని మురళీ మోహన్ అన్నారు. సెట్‌లోకి వెళ్లినప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ వస్తే వెంటనే లేచి నిలబడి, కుర్చీ వేసి కూర్చున్న తర్వాతే కూర్చుంటారని, ఈ రోజుకీ ఆయనలో ఆ వినయం ఉందని అన్నారు. సినీ పరిశ్రమలో పాటించాల్సిన విలువలను గురించి సత్యనారాయణ గారు తనకు చెప్పిన రెండు ముఖ్యమైన సలహాలను మురళీ మోహన్ గుర్తు చేసుకున్నారు. మొదటిది, ఒకప్పుడు పెద్ద హీరోలుగానో, కమెడియన్లుగానో, విలన్లుగానో ఉండి, ఇప్పుడు అవకాశాలు లేని వారు ఎవరైనా వస్తే, వెంటనే లేచి నిలబడి, వారిని కూర్చోబెట్టి, కాఫీ టీ ఇచ్చి, పని మీద వచ్చారా అని అడిగి, వారికి గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో తెలిపారు.

వారికి ఆర్థిక సహాయం అక్కర్లేదు, ఆ మర్యాద ఇస్తే చాలని సత్యనారాయణ గారు చెప్పారని మురళీ మోహన్ వివరించారు. రెండవది, షూటింగ్ లేని రోజున నిర్మాతలకు ముందుగా తెలియజేసి, వారికి ఏదైనా డబ్బింగ్ లేదా ప్యాచ్ వర్క్ ఉంటే పెట్టుకోమని చెప్పడం ముఖ్యం అని సత్యనారాయణ గారు సలహా ఇచ్చారని, ఎందుకంటే అన్నం పెట్టేవాడు నిర్మాత కాబట్టి, వారికి విలువ ఇవ్వాలని మురళీ మోహన్ చెప్పారు. ఈ రెండు సూచనలను తాను ఈ రోజుకీ పాటిస్తున్నానని మురళీ మోహన్ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..