
Delhi: ఢిల్లీలో నవవధువు మృతి అనుమానాస్పదంగా మారింది. పెళ్లైన రెండు నెలలకే 28 ఏళ్ల ఆకృతి బిల్డింగ్ పైనుంచి కింద పడి మరణించింది. ఆమె ఎలా కిందపడిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన ఢిల్లీలోని లోధికాలనీలో చోటుచేసుకుంది. పాలికాకుంజ్లోని ఎన్డీఎంసీ ఫ్లాట్ల భవనం బయట నేలపై ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆకృతిని హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని, శారీరకంగా హింసిస్తున్నాడని ఆమె కుటుంబీకులు ఆరోపించారు. ఆమె మృతికి భర్త, అత్తమామలే కారణమని ఆరోపించారు. దీనిని హత్యగా చిత్రీకరించేందుకు ఆమె అత్తమామలు ప్రయత్నిస్తున్నారని ఆకృతి సోదరులు ఆరోపించారు. ఆకృతి మానసికంగా దృఢమైన వ్యక్తి అని, ఆమె ఆత్మహత్యకు పాల్పడే అవకాశమే లేదని చెబుతున్నారు.
కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ఆకృతితో మాట్లాడినప్పుడు, తాను ఆఫీసు నుండి బయలుదేరానని చెప్పిందని, ఆతర్వాత కొద్దిసేపటికే ఆమె ఫోన్లో అందుబాటులో లేకుండాపోయిందని చెప్పారు. పుష్ప్ విహార్లోని ప్రభుత్వ ఫ్లాట్లలో నివసిస్తున్న కార్మిక శాఖలోని ఒక సెక్షన్ ఆఫీసర్ కుమారుడిని ఆకృతి వివాహం చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పుష్ప్ విహార్కు చెందిన ఆకృతి ఈ ఏడాది ఏప్రిల్ 24న వివాహం చేసుకుంది. ఆమె ఛత్తర్పూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతిపై మేజిస్ట్రేట్ విచారణకు కూడా ఆదేశాలు కోరినట్లు తెలిపారు. ప్రమాదమా, ఆత్మహత్యా, లేక హత్యా అనే అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.