
Wife Kills Husband: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా హత్య కేసు సంచలనంగా మారింది. భర్తను దారుణంగా హత్య చేసిన భార్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కనిపించకుండాపోయాడని నాటకాలు ఆడుతున్న భార్య భాగోతం బయటపడింది. భర్తను హత్య చేసి ఇంటి బాత్రూమ్లోనే పూడ్చిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు 45 రోజుల తర్వాత ఈ హత్య బయటపడింది. మృతుడిని సురేంద్ర శర్మగా గుర్తించారు. నిందితురాలైన అతడి భార్య రూబీ శర్మను పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు.పోలీసులు విచారణలో రూబీ శర్మ కీలక వివరాలను వెల్లడించింది. తన భర్తకు ఆహారంలో 15-20 నిద్రమాత్రలు కలిపి తినిపించినట్లు వెల్లడించింది. మత్తులోకి వెళ్లిన తర్వాత హత్య చేసి, బాత్రూమ్ టైల్స్ కింద పూడ్చి పెట్టింది. తన భర్త కోసం వెతుకుతున్నట్లు నటిస్తూ, పొరుగువారి ముందు ఏడుస్తూ అందర్ని నమ్మించే ప్రయత్నం చేసింది.
ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య జరిగిన అదే రోజు ఉదయం రూబీ తన బావ అనిల్ శర్మకు ఫోన్ చేసి, “అమ్మను, పిల్లలను తీసుకెళ్లండి… కానీ ఇంట్లోకి మాత్రం రావద్దు” అని చెప్పింది. ఆ సమయంలో ఇది సాధారణంగా అనిపించినప్పటికీ, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పిందో అర్థమైందని చెప్పాడు. రూబీ మృతదేహం కోసం ముందుగా తవ్వని గుంతలో పూడ్చిపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మే 26న సురేంద్ర కనిపించడం లేదని రూబీ, ఆమె బావతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సురేంద్ర సోదరుడు అనిల్ శర్మకు రూబీ ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ, బ్యాంక్ లావాదేవీలతో పాటు ఇతర వివరాలను పరిశీలించాడు. చివరకు జూలై 3న రూబీ స్వయంగా అనిల్కు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. సురేంద్రను బాత్రూంలో పాతిపెట్టినట్లు చెప్పింది. అయితే ఈ నేరంలో మరెవరైనా సహకరించారా? గుంత ఎవరు తవ్వారు? మృతదేహాన్ని పాతిపెట్టడంలో ఇంకెవరైనా పాత్ర ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.