
ఆంధ్రప్రదేశ్ వాసులకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది ప్రస్తుతానికి బాలాసోర్ (ఒడిశా)కు 40 కి.మీ., చాంద్బలి (ఒడిశా)కు 50 కి.మీ., దిఘా (పశ్చిమ బెంగాల్)కు 70 కి.మీ దూరంలో ఉందని తెలిపారు. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో చాంద్బలి – దిఘా మధ్య బాలాసోర్ సమీపంలో ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. ఆతదుపరి 24 గంటల్లో ఇది ఉత్తర ఒడిశా,ఛత్తీస్గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందన్నారు.
దీని ప్రభావంతో సోమవారం(06-07-2026) విజయనగరం, మన్యం,అల్లూరి, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. అవసరం అయితే తప్పా ఎవరూ బయటకు వెళ్లవద్దని తెలిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో చెల్లు, విద్యుత్ స్థంభాలు విరిగి పడే అవకాశం ఉందని.. పొలాలకు వెళ్లే సమయంలో రైతులు జాగ్రత్తగా ముందు చూస్తూ వెళ్లాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ స్థంబాలు విరిగి పడితే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.