
Andhra Pradesh Ranks No.1: ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత దిశగా మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మహిళలకు వ్యక్తిగత పారిశ్రామిక రుణాల పంపిణీలో 99.7 శాతం లక్ష్యాన్ని సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణ పారిశ్రామికీకరణలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శ రాష్ట్రంగా గుర్తింపు పొందింది.
2025–26 ఆర్థిక సంవత్సరానికి మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.1,500 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.1,495.50 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. మొత్తం 1.50 లక్షల మంది మహిళలకు రుణాలు అందించాలనే లక్ష్యంలో 1,47,840 మంది మహిళలకు వ్యక్తిగత పారిశ్రామిక రుణాలు మంజూరు చేసింది. ఇదే సమయంలో 48,584 మంది మహిళలకు రుణాలు అందించిన తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా సమాన లక్ష్యాలు నిర్దేశించుకున్నప్పటికీ కేవలం 15 నుంచి 25 శాతం మాత్రమే సాధించగలిగాయి.
మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీలో అద్భుత పనితీరు కనబరచిన నేపథ్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి కూడా ఆంధ్రప్రదేశ్కు అత్యధిక లక్ష్యాన్ని కేంద్రం కేటాయించింది. వచ్చే ఏడాదిలో 1.67 లక్షల మంది మహిళలకు రూ.1,670 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME) పథకంలోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2025–26లో ఈ పథకం ద్వారా 35,934 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తూ నిర్దేశించిన లక్ష్యంలో 95 శాతం సాధించింది. 35,210 మంది లబ్ధిదారులతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది.
రుణాల పంపిణీతో పాటు గ్రామీణ మహిళలకు స్థిరమైన ఉపాధి కల్పించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్రం ప్రశంసించింది. మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కేంద్ర నివేదికలు వెల్లడించాయి. డ్వాక్రా మహిళలకు వ్యాపార నిర్వహణ, ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో సెర్ప్ ద్వారా ప్రత్యేక శిక్షణలు అందిస్తున్నారు.
అలాగే డిజిటల్ మానిటరింగ్, ఎంఐఎస్ వ్యవస్థ, ఫీల్డ్ తనిఖీల ద్వారా రుణాల మంజూరు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ మహిళలకు వేగంగా ఆర్థిక సహాయం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్యాంకుల సహకారంతో రుణాల పంపిణీ వేగవంతం కావడం కూడా ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇక, ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ లక్ష్యాల సాధనలోనూ ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణ పారిశ్రామికీకరణ, మహిళా సాధికారత, ఉపాధి కల్పన, కుటుంబాల ఆదాయాల పెంపులో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా పేద, వెనుకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంలో జాతీయ స్థాయిలో ఛాంపియన్గా నిలవడం రాష్ట్రానికి మరో గౌరవంగా మారింది.