Reading Time: 2 minutes
రుతుపవనాల ఉధృతి.. దేశవ్యాప్తంగా ముసురు.. 23 రాష్ట్రాల్లో ‘అతి భారీ వర్షాలు’.. అలర్ట్!

భారతదేశంలో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, రాబోయే 24 నుంచి 72 గంటల్లో దేశంలోని 23 రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలను భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసింది. రుతుపవనాల ఉత్తర సరిహద్దు ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్ మరియు నేపాల్ సరిహద్దుల వరకు విస్తరించింది. రాబోయే రెండు రోజుల్లో ఇవి గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అదనంగా, జూలై 2 నుండి ఒక కొత్త పశ్చిమ అవాంతరం క్రియాశీలకం కానుండటంతో వాయువ్య భారతదేశంలో వర్షాల తీవ్రత మరింత పెరగనుంది.

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మారనున్న వాతావరణం

జాతీయ రాజధాని ప్రాంతంలో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న తీవ్రమైన వేడి, తేమ నుండి ప్రజలకు ఉపశమనం లభించనుంది. జూన్ 30న ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. జూలై 1 నుండి జూలై 4 మధ్య వర్షాలు మరింత విస్తృతంగా కురిసే అవకాశం ఉండటంతో, గరిష్ట ఉష్ణోగ్రతలు 5°C నుండి 6°C వరకు తగ్గుతాయి. అయితే, వాతావరణంలో పూర్తి మార్పు వచ్చే వరకు జూన్ 30 వరకు కొన్ని చోట్ల వడగాడ్పుల ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో హై అలర్ట్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు పూర్తిస్థాయిలో చురుకుగా మారాయి. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో జూన్ 30 నుండి జూలై 3 వరకు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జూలై 2 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జూన్ 30 నుండి జూలై 5 వరకు కొండ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. దీనివల్ల కొండచరియలు విరిగిపడటం, రహదారులు మూసుకుపోవడం, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎమ్‌డి హెచ్చరించింది. చార్ ధామ్ యాత్రికులు తమ ప్రయాణాలకు ముందు వాతావరణ సమాచారాన్ని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు.

బీహార్, జార్ఖండ్‌లలో ఖరీఫ్ సాగుకు అనుకూలం

బీహార్‌లోని ఉత్తర, మధ్య జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు ఖరీఫ్ పంటల సాగుకు ఎంతో మేలు చేయనున్నాయి. అయితే, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మెరుపులు వచ్చేటప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు హెచ్చరించారు. జార్ఖండ్‌లోని గనుల, కొండ ప్రాంతాల్లో నదుల నీటిమట్టం పెరిగే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు.

మధ్య, పశ్చిమ, దక్షిణ భారతదేశం – ఈశాన్య రాష్ట్రాలు

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, మహారాష్ట్రలలో రుతుపవనాలు చురుగ్గా కదులుఉన్నాయి. జూలై 3 తర్వాత కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక తీరప్రాంతాలలో అతి భారీ వర్షాలు, తెలంగాణ, తమిళనాడులలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో రాబోయే కొద్దిరోజుల పాటు విస్తారంగా వర్షాలు కొనసాగుతాయి.

ఐఎమ్‌డి కీలక అంచనాలు – ముఖ్యాంశాలు

అస్సాం, మేఘాలయ, బీహార్, కేరళ, కొంకణ్ రాష్ట్రాల్లో సోమవారం నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రాబోయే రెండు నుంచి ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించే అవకాశం ఉంది. జూలై 2 నుంచి ఏర్పడనున్న కొత్త పశ్చిమ అవాంతరం కారణంగా వాయువ్య భారతదేశం అంతటా వర్షపాతం పెరిగే అవకాశం ఉంది.

రుతుపవనాలకు తోడు అల్పపీడనాలు

అయితే, ఈ రుతుపవనాల పునరుద్ధరణ కేవలం రుతుపవన ద్రోణి వల్ల మాత్రమే జరగడం లేదు. ఈ వారంలో బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడన ప్రాంతాలు ఏర్పడి, మధ్య భారతదేశం గుండా భూభాగంలోకి కదలనున్నాయి. ఈ వ్యవస్థలు వాతావరణంలోకి భారీ మొత్తంలో తేమను పంపి, రుతుపవన ప్రసరణను మరింత బలపరుస్తాయి. దీనివల్ల తూర్పు, మధ్య మరియు పశ్చిమ భారతదేశం అంతటా వర్షపాతం గణనీయంగా పెరుగుతుంది.

మత్స్యకారులకు కీలక సూచన

అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎమ్‌డి హెచ్చరించింది. అలాగే జూలై 3 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. ఈ హెచ్చరిక కొంకణ్-గోవా, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల తీరప్రాంతాలను వర్తిస్తుంది. రుతుపవనాల విస్తరణతో ముందస్తు జాగ్రత్తల హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున, ప్రజలు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అధికారిక వాతావరణ బులెటిన్లను క్రమం తప్పకుండా అనుసరించాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..