Reading Time: 2 minutes

ఆధ్యాత్మికం.. దైవభక్తి అంటే ఏమిటి? పూజలు చేసేవారు అందరూ భక్తులేనా..!

Caption of Image.

దైవ భక్తి అంటే ఏమిటి…. పూజలు చేసే వారందరూ దైవభక్తులేనా.. భక్తులు పాపాలు చేయవచ్చా.. భక్తులు అంటే ఎవరు.. పండితులు  ఏం చెబుతున్నారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చాలామంది రోజూ బెడ్​ పై నుంచి లేస్తూనే దేవుడికి నమస్కారం చేస్తూ లేస్తారు.  దైవభక్తి ఉన్నచోట మంచితనం ఉంటుందంటారు పెద్దలు. అయినా నేడు ప్రపంచంలో  చాలా మోసాలు జరుగుతున్నాయి.  కొంతమంది దైవభక్తులమని చెప్పుకొనేవారూ కూడా అనేక  పాపాలు చేస్తున్నారు. భక్తి ఉంటే పాపాలు చేసినా ఫరవాలేదా అంటే అలా కుదరదని పండితులు చెబుతున్నారు.  గతంలో చేసిన పుణ్య ఫలం మన ఖాతాలో ఉండేంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది  కాస్త కరిగిపోతే ఆయన చేసిన పాపాలకు.. మోసాలకు ఫలితం కనపడుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  అందుకే కొంత కాలం ఎంతో దర్జాగా  బతికిన వారు.. కొంత కాలం తరువాత హీనంగా ఉంటారు. 

దేవుడికి పూజలు చేసే వారంతా దైవభక్తులైపోరు. నిజంగా దేవుడి మీద ప్రేమ ఉన్నవారు.. ఎవరికి ఎలాంటి హాని కలిగించని వారు.. మోసం చేయని వారు అసలైన .. నిజమైన దైవభక్తులు.  నిజంగా భక్తి ఉన్నవాడు పాపం చేయడు..  చేయలేడు. పండితులు చెప్పిన వివరాల ప్రకారం  దైవం అనగా  ధర్మప్రియుడు. ధర్మాన్ని విడిచిపెడితే అది భక్తి అనిపించుకోదు. భక్తికి ధర్మమే ప్రాణమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

చాలామంది గుళ్లు, గోపురాలు ప్రతి సందర్భంలో కూడా దర్శించుకుంటారు.  నిత్యం దేవుడికి పూజలు చేసేవారు అందరూ భక్తులేనని చెప్పలేం. తమ కోరికలను తీర్చుకోవడానికి ఎవరికి వీలైన మార్గాన్ని వారు ఆశ్రయిస్తారు. అలా కొందరు దేవుడిని కూడా కొలుస్తారు. వారికి దేవుడి పట్ల నిజమైన శ్రద్ధ ఉండదు. అలాంటి వారందరినీ “భక్తులు అని అనలేము.  వారి స్వార్దం కోసం భగవంతుడిని ప్రార్థిస్తుంటారు.  నిజమైన భక్తులు ఎవరూ  కోరికలు కోరరు. 

 ప్రజల్లో తమ కోరికల కోసం దేవుడి పట్ల చూపించే ఆసక్తిని అవకాశంగా మార్చుకొని సొమ్ము చేసుకునే వ్యాపారులు కూడా ఉంటారు. వారినే భక్తులుగా భావించడం పొరపాటు. పాపం ఉన్నచోట భక్తి పండదు. దైవశక్తి జాగృతం కాదు. దేవాలయాల దగ్గర చేరే గుంపులందరికీ దైవతత్త్వం పట్ల నిజమైన ఆసక్తి ఉండదని పండితులు అంటున్నారు.

భక్తుడు భగవంతుని నామ, గుణ, మహిమల పట్ల ప్రేమ కలిగి, నిరంతరం ఆ చింతనలోనే కాలం గడుపుతూ, సత్యం, అహింస, శుచి, దయ వంటి సద్గుణాలను అలవరచుకుంటాడు. నిజంగా భగవంతుని అనుగ్రహం ధర్మపరునికే లభిస్తుంది. ధర్మం, ప్రేమ ఈ రెండూ కలిసినప్పుడే అది భక్తి అవుతుంది.

చాలామంది చేరే చోట సొమ్ము చేరుతుంది. ఆ సొమ్మును స్వాహా చేయడానికి అక్రమార్జనపరులు కూడా చేరతారు. అదే విధంగా దేవుడి సొమ్మును స్వాహా చేసే మహాపాపాత్ములు కూడా ఉంటారు.అలాంటి కొంతమంది దేవాలయాల్లో ఉన్నంత మాత్రాన వారు భక్తులైపోరు. వారి పాపాలు కూడా పరిహరింపబడవు. పైగా, బయట చేసే మోసాలకన్నా దైవసంబంధమైన సంపదను దుర్వినియోగం చేయడం మరింత ఘోరమైన పాతకంగా శాస్త్రాలు పేర్కొంటాయి.  అలాంటి వారు చేసే పాపపు పనులు.. మోసాల వలన వారి వారసులు కూడా  కర్మఫలాలను అనుభవించక తప్పదని పురాణాల ద్వారా తెలుస్తుంది.

కొంతమంది తాత్కాలికంగా వారు లాభపడినట్లు కనిపించినా, భవిష్యత్తులో వారు తీవ్రమైన బాధలను అనుభవిస్తారనే విషయంలో సందేహం లేదు.  అటువంటి వారిని చూసి ..ఇదే భక్తి…ఇదే ఆధ్యాత్మికత..  అని పొరపడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాపం ఉన్నచోట పరమాత్మ ఉండడు. ధర్మం ఉన్నచోటే దైవానుగ్రహం.. పరమాత్మ  ఉంటుంది.ధర్మాన్ని అనుసరించే వారికి దేవుడి పూజలు.. ఆధ్యాత్మిక చింతన.. దైవభక్తి.. బోనస్​ అవుతాయని పండితులు చెబుతున్నారు..

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.