
Gudivada Amarnath: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు హాజరుకానున్నారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్.. విచారణకు హాజరయ్యేందుకు గతంలో రెండుసార్లు గడువు కోరిన ఆయన, తాజాగా విజయవాడలో మహిళా కమిషన్ ఎదుట తన వివరణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి విజయవాడ బయలుదేరారు గుడివాడ అమర్నాథ్, లీగల్ కౌన్సిల్ సభ్యులతో కలిసి కమిషన్ ఎదుట హాజరవుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై తనకు పూర్తి గౌరవం ఉందని, అందుకే మహిళా కమిషన్ విచారణకు హాజరవుతున్నానని చెప్పారు.
విచారణకు ముందు మీడియాతో మాట్లాడిన అమర్నాథ్.. హోం మంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. తాను ఎక్కడా మహిళలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడలేదని, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని పేర్కొన్నారు. అనితపై తాను చేసింది కేవలం రాజకీయ విమర్శ మాత్రమేనని, దానిని వక్రీకరించి తెలుగుదేశం పార్టీ కృత్రిమ ఆందోళనలు చేపట్టిందని ఆరోపించారు. మహిళా కమిషన్ ఎదుట తన వాదనను బలంగా వినిపిస్తానని అమర్నాథ్ తెలిపారు. గతంలో హోం మంత్రి తనపై, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను కమిషన్కు సమర్పించే అవకాశముందని సమాచారం.
అదే సమయంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఘటనలను కూడా అమర్నాథ్ ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని, సాయికృష్ణ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన మహిళా కమిషన్కు కనిపించలేదా అని ప్రశ్నించారు. అలాగే నడిరోడ్డుపై ఓ మహిళపై జనసేన నేతలు దాడి చేసిన ఘటనపైనా మహిళా కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను మహిళలకు ఆపాదించే ప్రయత్నం చేసి టీడీపీ నాయకులు ప్రజల్లో హాస్యాస్పదంగా మారారని అమర్నాథ్ విమర్శించారు. మహిళా కమిషన్ విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..