Reading Time: < 1 minute

హిమాయత్‌నగర్ టీటీడీ ఆలయంలో వైభవంగా రథోత్సవం

Caption of Image.

హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (టిటిడి)లో నిర్వహిస్తున్న వసంతోత్సవాలు భక్తుల సందడితో వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మే26న స్వామివారి రథోత్సవాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి ఆలయ ప్రాంగణంలో శోభాయాత్రగా తీసుకెళ్లారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన పల్లకి ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహిళా భక్తులు కోలాటాలు ఆడగా, యువకులు భజనలు నిర్వహించారు. చిన్నారులు భక్తి గీతాలకు నృత్యాలు చేసి ఉత్సవాలకు మరింత శోభ తీసుకొచ్చారు. 

వసంతోత్సవాల సందర్భంగా స్వాతి సుదర్శన హోమం, ధన్వంతరి హోమం, స్నపన తిరుమంజనం వంటి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పసుపు, గంధం, కస్తూరి తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు జరిపి, అనంతరం పవిత్ర జలాన్ని భక్తులపై చల్లారు. రథోత్సవాన్ని తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

©️ VIL Media Pvt Ltd.