Reading Time: < 1 minute

ఆదిభట్లలో విషాదం.. ఎంసెట్ లో మార్కులు తక్కువ వచ్చాయని యువకుడు ఆత్మహత్య!

Caption of Image.

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ గూడా గ్రామంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంసెట్ పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చాయనే మనస్తాపంతో.. ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఆదిభట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్ గూడా గ్రామానికి చెందిన గడుసు ఆదిత్య అనే యువకుడు ఇటీవలే ఎంసెట్ పరీక్షలు రాశాడు. అయితే, పరీక్షలో మార్కులు తక్కువగా రావడంతో ఆదిత్య గత కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకుని, ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసేసరికి ఆదిత్య అపస్మారక స్థితిలో వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న వెంటనే ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎంసెట్ ఫలితాల భయంతో నిండు ప్రాణాన్ని బలితీసుకోవడంతో.. మృతుడి ఇంట్లో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

©️ VIL Media Pvt Ltd.