Reading Time: < 1 minute
Imd Rain Alert Monsoon Gains Momentum Heavy Rainfall Warning Issued For Multiple States

ఓ వైపు ఎల్ నినో భయాలు, మరోవైపు దంచికొడుతున్న ఎండల నడుమ భారత వాతారణ శాఖ చల్లని కబురును అందించింది. రుతుపవనాలు వేగం పుంజుకుని ముందుకు సాగుతున్నాయని తెలిపింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో తుఫాను, వర్షాల హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. వీటిలో జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, కేరళ, గోవా, తెలంగాణ ఉన్నాయి. ఈరోజు కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మే 25వ తేదీన ఢిల్లీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలి, ధర్మశాలలో మే 29 వరకు ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, నైనిటాల్, హరిద్వార్‌లలో వాతావరణం మారుతోంది. మే 25వ తేదీన బలమైన గాలులతో పాటు వర్షం, వడగళ్ళు పడే అవకాశం ఉంది.
మే 24, 25 తేదీలలో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్మూ, పహల్గామ్‌లలో ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

జార్ఖండ్‌లోని రాంచీ, జంషెడ్‌పూర్, ధన్‌బాద్‌లలో ఈరోజు, రేపు (మే 24-25) తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తదనంతరం, మే 26, 29 మధ్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.