Reading Time: 2 minutes
Pakistan Cuts Petrol And Diesel Prices Again Amid Global Oil Pressure

Pakistan Cuts Petrol and Diesel Prices: పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రజలకు మరోసారి ఇంధన ధరల విషయంలో ఊరటనిచ్చింది. పెట్రోల్ మరియు హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరలను తగ్గిస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. తాజా ప్రకటన ప్రకారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.6, డీజిల్ ధరను రూ.6.80 మేర తగ్గించారు. ఈ కొత్త ధరలు మే 23 నుంచి అమల్లోకి వచ్చినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. కొత్త ధరల ప్రకారం పాకిస్తాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.403.78గా ఉండగా, హెచ్‌ఎస్‌డీ ధర రూ.402.78గా నిర్ణయించారు. ఇంధన ధరలను వరుసగా రెండో వారం కూడా తగ్గించడం గమనార్హం. గత వారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 చొప్పున తగ్గించారు.

ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ, పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజలకు కొంత ఊరట కలిగించింది. ముఖ్యంగా పెట్రోల్‌ను ఎక్కువగా ప్రైవేట్ వాహనాలు, రిక్షాలు, ద్విచక్ర వాహనాల్లో ఉపయోగిస్తుండటంతో మధ్యతరగతి ప్రజలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే హై-స్పీడ్ డీజిల్‌ను భారీ రవాణా వాహనాలు, పరిశ్రమలు మరియు పెద్ద జనరేటర్లలో వినియోగిస్తారు. అందువల్ల డీజిల్ ధర తగ్గడం రవాణా ఖర్చులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం ధరలు తగ్గుతున్నప్పటికీ, గత కొన్ని నెలలుగా పాకిస్తాన్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత మార్చి 6న పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 మేర పెంచింది. అనంతరం ఏప్రిల్ 2న కూడా పెట్రోల్‌పై 43 శాతం, డీజిల్‌పై 55 శాతం పెరుగుదల నమోదైంది. ఫిబ్రవరిలో మధ్యప్రాచ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతి శుక్రవారం ఇంధన ధరలను సమీక్షిస్తోంది. ఈ కాలంలో ధరలు పలుమార్లు పెరగడం, తగ్గడం చోటుచేసుకుంది.

ఇక భారత్‌లో కూడా ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ముడి చమురు ధరల ప్రభావంతో మూడు దఫాల్లో కలిపి సుమారు రూ.5 మేర ధరలు పెరిగాయి. శనివారం మరోసారి పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరగగా, సీఎన్‌జీ ధర కూడా రూ.1 మేర పెరిగిన విషయం విదితమే.. అంటే, భారత్‌లో పెట్రో ధరలు పెరుగుతుండగా.. ఇప్పటికే భారీగా పెంచిన పాకిస్తాన్‌.. ఇప్పుడు క్రమంగా తగ్గించే ప్రయత్నాల్లో ఉంది..