Reading Time: 2 minutes
Piyush Goyal Warning To Indian Industry Amid Gulf Crisis

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇప్పటికే దేశ ప్రజలు పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. తాజాగా భారత పరిశ్రమలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హెచ్చరిక జారీ చేశారు. ‘‘ఇక బిజినెస్ యాజ్ యూజువల్ కుదరదు.’’ అని అన్నారు.

ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ వార్షిక వ్యాపార సదస్సులో కేంద్రమంత్రి మాట్లాడారు.. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో భారత పరిశ్రమలు అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. విదేశీ సరఫరాదారులపై ఆధారపడకుండా దేశీయ పరిశ్రమలకు పరస్పరం మద్దతు ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో “ఇక సాధారణ వ్యాపార విధానం సరిపోదు” అంటూ హెచ్చరించారు.

సంక్షోభాల నుంచి భారత్ ఎప్పుడూ మరింత బలంగా బయటపడిందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసు అంతరాయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పనిచేయడం అత్యంత కీలకమని అన్నారు. ‘‘ఇప్పుడు మనకు అవసరమైంది ఒక వేకప్ కాల్” అని వ్యాఖ్యానించారు. మోడీ ఇటీవల చేసిన స్వావలంబన, ఆర్థిక క్రమశిక్షణ పిలుపులను ప్రస్తావిస్తూ.. “ఇది ప్రభుత్వం వర్సెస్ పరిశ్రమలు కాదు.. ప్రభుత్వం, వ్యాపారాలు, పరిశ్రమలు, ప్రజలంతా కలిసి ముందుకు వెళ్లాల్సిన సమయం” వచ్చిందని అన్నారు.

భారత పరిశ్రమలు పరస్పరం సహకరించుకోవాలని స్పష్టం చేశారు. దక్షిణ కొరియా, జపాన్ దేశాల పరిశ్రమల సమన్వయ విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. ‘‘కొరియా, జపాన్ తరహాలో కలిసి పనిచేయడం భారత పరిశ్రమలు నేర్చుకోవాలి.’’ అని సూచించారు. “ఇంకెంత కాలం స్వార్థపూరిత దృక్పథంతో ఉంటాం? భారత పరిశ్రమల సమిష్టి అభివృద్ధి చివరకు వ్యక్తిగత భవిష్యత్తుకూ మేలు చేస్తుంది” అని అన్నారు. “ఇది ఇక సూచన మాత్రమే కాదు.. అవసరంగా మారుతోంది” అంటూ గోయల్ వ్యాఖ్యానించారు. భారత స్టీల్ విదేశాలకు వెళ్లకుండా ప్రభుత్వం ఆపాల్సిన అవసరం లేదని.. పరిశ్రమలే పరస్పరం దేశీయ మార్కెట్‌కు మద్దతు ఇవ్వాలని సూచించారు.

ప్రపంచ వ్యాప్తంగా జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల, సరఫరా గొలుసు సమస్యల నేపథ్యంలో పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవలి కాలంలో భారత్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, సోలార్ మాడ్యూల్స్‌, ఔషధ రంగాల్లో స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ పథకాలను అమలు చేస్తోంది. అలాగే యూఏఈ, ఆస్ట్రేలియా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం యూకే, యూరోపియన్ యూనియన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. విదేశీ మారక నిల్వలు, ఎగుమతులు, విదేశాల నుంచి వచ్చే రిమిటెన్సులు భారత ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనమని అన్నారు.