Reading Time: < 1 minute
Up Woman Climbs Mobile Tower Demanding Husbands Release Kanpur

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ మహిళ హల్‌చల్ సృష్టించింది. జైలులో ఉన్న తన భర్తను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగింది. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మహిళను కిందికి దించేందుకు ప్రయత్నించారు.

ఈ ఘటనపై కాన్పూర్ అదనపు పోలీస్ కమిషనర్ విపిన్ టాండా వివరాలు వెల్లడించారు. 2025 అక్టోబర్‌లో బాధిత మహిళ తల్లి సచెండి పోలీస్ స్టేషన్‌లో యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసింది. ఆ కేసులో అరెస్టయిన వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహిళ టవర్ ఎక్కినట్లు తెలిపారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు చట్టపరమైన ప్రక్రియను అనుసరించి కోర్టు అనుమతి పొంది ఆమె భర్తను అక్కడికి తీసుకువచ్చారు. కింద నిలబడి ఉన్న తన భర్తను చూడగానే ఆ మహిళ శాంతించి.. నెమ్మదిగా టవర్ పైనుంచి కిందకు దిగింది. కిందకు వచ్చిన తర్వాత నేరుగా తన భర్త దగ్గరకు వెళ్లి ఏడుస్తూ అతన్ని కౌగిలించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.