Reading Time: < 1 minute
Pm Modi Slams Brs And Congress Ahead Of Hyderabad Bjp Rally

ప్రధాని మోడీ ఆదివారం దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు వస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో మోడీ పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బీజేపీ సభలో ప్రసంగించనున్నారు.

ఉదయం 11 గంటలకు కర్ణాటకలో నిర్వహించనున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. సమాజ సేవ లక్ష్యంగా వివిధ రంగాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని మోడీ పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా సుమారు రూ.9500 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. రహదారులు, లాజిస్టిక్స్, వస్త్ర పరిశ్రమ, రైల్వేలు, ఇంధన రంగం తదితర విభాగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అలాగే సింధు ఆస్పత్రిని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

హైదరాబాద్ టూర్ నేపథ్యంలో మోడీ కీలక ట్వీట్ చేశారు. ‘‘గతంలో బీఆర్ఎస్ దుష్పరిపాలన.. ఇప్పుడు కాంగ్రెస్ దుష్పరిపాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. మాకు పెరుగుతున్న మద్దతును బట్టి చూస్తే.. తెలంగాణ ప్రజల మొదటి ఎంపిక మా పార్టీయే.’’ అని మోడీ పేర్కొన్నారు.