
Karun Nair IPL 2026: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న 48వ లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్లో పిచ్పై మంచి స్కోరు సాధించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలని అక్షర్ భావించినప్పటికీ, బ్యాటర్లు మాత్రం ఆ ప్రణాళికను అమలు చేయడంలో విఫలమయ్యారు. కేవలం 52 పరుగులకే ఢిల్లీ తన కీలకమైన మూడు వికెట్లను కోల్పోయి ఆత్మరక్షణలో పడిపోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (12), పథుమ్ నిస్సాంక (19) మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు.
కరుణ్ నాయర్ చేజేతులా చేసుకున్నాడా?
ఈ మ్యాచ్లో అందరి దృష్టి కరుణ్ నాయర్పైనే ఉంది. కేఎల్ రాహుల్, నిస్సాంక వికెట్లు పడిన తర్వాత నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన నాయర్, ఇన్నింగ్స్ను చక్కదిద్దుతాడని యాజమాన్యం ఆశించింది. కానీ, అతను కేవలం 13 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. చైనామ్యాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ వేసిన ఒక సాధారణ బంతిని స్వీప్ చేసే క్రమంలో షార్ట్ ఫైన్ లెగ్లో ఉన్న గుర్జప్నీత్కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. కీలక సమయంలో నిలకడగా ఆడాల్సింది పోయి, అనవసర షాట్కు ప్రయత్నించి నాయర్ తన వికెట్ను పారేసుకోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
వరుసగా విఫలమవుతున్న నాయర్..
mfs after saying “Dear cricket give me one more chance” #KarunNair #CSKvsDC pic.twitter.com/MwIxEVjEyE
— Aditya Narayan (@narayan_1803) May 5, 2026
ఐపీఎల్ 2026లో కరుణ్ నాయర్కు ఇది రెండో అవకాశం. గత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కూడా అతను 5 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కేవలం బ్యాటింగ్లోనే కాకుండా, ఫీల్డింగ్లోనూ కరుణ్ తడబడుతున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన రెండు సులభమైన క్యాచ్లను చేజార్చడం ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణమైంది. ఇప్పుడు సిఎస్కేపై బ్యాటింగ్లోనూ విఫలం కావడంతో జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్..
చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. నితీష్ రాణా (15) కూడా కాసేపు క్రీజులో ఉన్నా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. జట్టును ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం 6 బంతుల్లో కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేసి తీవ్ర ఒత్తిడిలో ఉంది. పిచ్ స్లోగా ఉండటంతో చెన్నై స్పిన్నర్లు రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ పట్టు బిగించారు.
ఢిల్లీ బ్యాటర్లు ఆరంభం లభిస్తున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మార్చలేకపోతున్నారు. ముఖ్యంగా కరుణ్ నాయర్ వంటి అనుభవం ఉన్న ఆటగాడు బాధ్యతారాహిత్యంగా ఆడటం జట్టును దెబ్బతీసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఢిల్లీ ఈ మ్యాచ్లో గౌరవప్రదమైన స్కోరు సాధించడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..