దక్షిణ భారత దేశంలో ఇడ్లీ, దోశలు అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారాలు. అయితే, వేసవి కాలం రాగానే చాలా మంది ఇళ్లల్లో ఎదురయ్యే ప్రధాన సమస్య ఇడ్లీ పిండి అతిగా పులిసిపోవడం. అధిక వేడి వల్ల పిండిలోని బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది, పిండి త్వరగా పుల్లగా మారుతుంది. ఫలితంగా ఇడ్లీలు గట్టిగా రావడమే కాకుండా, వింత వాసన వస్తాయి. ఈ సమస్యను ఈజీగా బయటపడేందుకు సింపుల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం..
చల్లటి నీటిని ఉపయోగించండి: ఎండకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల ఇడ్లీ, దోశ పిండి త్వరగా పులిసిపోయి పుల్లగా మారుతుంది. దీనివల్ల ఇడ్లీలు గట్టిగా రావడం లేదా రుచి మారడం జరుగుతుంది. పిండి అతిగా పులియకుండా ఉండాలంటే గ్రైండ్ చేసేటప్పుడు సాధారణ నీటికి బదులుగా ఐస్ వాటర్ లేదా చల్లటి నీటిని వాడండి. గ్రైండర్ తిరిగేటప్పుడు వచ్చే వేడిని ఇది తగ్గిస్తుంది. తద్వారా ఫెర్మెంటేషన్ ప్రక్రియ నెమ్మదిస్తుంది.
ఉప్పు కలిపే విషయంలో జాగ్రత్త: పిండిలో ఉప్పును ముందే కలపకుండా అవసరమైనప్పుడు మాత్రమే వేసుకోవడం మంచిది. సాధారణంగా పిండి రుబ్బిన వెంటనే ఉప్పు కలుపుతాము. కానీ ఎండకాలంలో పిండిని ఫ్రిజ్లో పెట్టే ముందు ఉప్పు కలపకపోవడమే మంచిది. మీకు కావాల్సినప్పుడు, పిండిని బయటకు తీసిన తర్వాత మాత్రమే ఉప్పు కలుపుకుంటే పులుపు తక్కువగా ఉంటుంది.
నిల్వ చేసే పద్ధతి: పిండి రుబ్బిన వెంటనే అది పొంగే వరకు బయట ఉంచకూడదు. కొద్దిగా ఫెర్మెంటేషన్ మొదలవ్వగానే గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో ఉంచాలి. పిండిని ఎప్పుడూ పెద్ద గిన్నెలో సగం వరకు మాత్రమే నింపాలి, తద్వారా అది పొంగినా బయటకు రాదు.
పుల్లటి పిండిని ఎలా సరిచేయాలి?: ఒకవేళ పిండి ఇప్పటికే పుల్లగా మారితే, అందులో కొద్దిగా కాచి చల్లార్చిన పాలు లేదా తాజా పెరుగు కలపండి. ఇది పిండిలోని అసిడిటీని తగ్గించి రుచిని సమతుల్యం చేస్తుంది. అలాగే, చిటికెడు వంట సోడా కలపడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. వేసవిలో ఆహార పదార్థాల పట్ల కొంచెం అదనపు జాగ్రత్త అవసరం. పైన పేర్కొన్న చిట్కాలను పాటించడం ద్వారా మీరు పిండి వృథా కాకుండా చూసుకోవచ్చు. ప్రతిరోజూ తాజాగా, మెత్తటి ఇడ్లీలను మీ కుటుంబ సభ్యులకు వడ్డించవచ్చు.




