Reading Time: 2 minutes
12 జిల్లాల్లో రైతులకు లాభం.. పరిశ్రమలకు ప్రయోజనం.. గంగా ఎక్స్‌ప్రెస్‌ హైవేను ప్రారంభించిన మోదీ

ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి ఇప్పుడు బుల్లెట్ రైలు వేగంతో దూసుకుపోతోంది. బుధవారం (ఏప్రిల్ 29) హర్దోయ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 594 కిలోమీటర్ల పొడవైన ‘గంగా ఎక్స్‌ప్రెస్‌వే’ను ప్రారంభించడంతో రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇది కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, యూపీని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా వేసిన బలమైన అడుగు. మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు సాగే ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే, ఉత్తరప్రదేశ్‌లోని 12 జిల్లాల గుండా వెళుతుంది. ఈ జిల్లాల పారిశ్రామిక రూపురేఖలను మార్చడంలో సహాయపడుతుంది.

హర్ధోయ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌ హైవేను ప్రారంభించిన ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్‌ అభివృద్దికి ఈ హైవే ఎంతో దోహదం చేస్తుందన్నారు. 12 జిల్లాల మీదుగా సాగే హైవేను అత్యవసర సమయాల్లో యుద్ద విమానాలు ల్యాండయ్యే విధంగా నిర్మించారని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. బెంగాల్‌ రెండో దశలో కూడా భారీగా పోలింగ్‌ నమోదవుతోందన్నారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. యూపీ అభివృద్ధిని సమాజ్‌వాదీ పార్టీ అడ్డుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్‌ , సమాజ్‌వాదీ పార్టీలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని మండిపడ్డారు.

ఇదిలావుంటే సుమారు రూ. 36,230 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు 12 జిల్లాలను అనుసంధానిస్తుంది. ప్రస్తుతం ఆరు లేన్లుగా ఉన్న ఈ మార్గాన్ని భవిష్యత్తులో ఎనిమిది లేన్లకు విస్తరించేలా డిజైన్ చేశారు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, 519 గ్రామాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. గతంలో, మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్‌కు రోడ్డు ప్రయాణానికి 11 గంటల సమయం పట్టేది, కానీ గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ సమయాన్ని ఆరు గంటలకు తగ్గిస్తుంది. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్‌లోని 12 జిల్లాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఈ ప్రాజెక్టులో ఇంజనీరింగ్ అద్భుతాలు, రక్షణ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వడానికి షాజహాన్‌పూర్ వద్ద 3.5 కిలోమీటర్ల ఎయిర్‌స్ట్రిప్‌ను సిద్ధం చేశారు. మార్గమధ్యంలో 14 ప్రధాన వంతెనలు, 165 చిన్న వంతెనలు, 32 ఫ్లైఓవర్‌లు నిర్మించారు. 19 ర్యాంప్ టోల్ ప్లాజాలు, అత్యాధునిక ప్రజా సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో యూపీలో మొత్తం ఎక్స్‌ప్రెస్‌వేల పొడవు 1,910 కిలోమీటర్లకు చేరింది. ఇది దేశంలోని మొత్తం ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌లో 60 శాతం కావడం విశేషం. అయితే ఉత్తర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (UPEIDA) లక్ష్యం ఇంకా పెద్దది. ‘మిషన్ 2029’ బ్లూప్రింట్ ప్రకారం, రాబోయే ఐదేళ్లలో ఈ నెట్‌వర్క్‌ను 3,200 కిలోమీటర్లకు విస్తరించనున్నారు. మే నెలలో ప్రారంభం కానున్న లక్నో-కాన్పూర్ మార్గంతో పాటు మరో 11 కొత్త లింక్ ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఈ రహదారుల వెంబడి పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుంది. అంతర్జాతీయ సంస్థలకు యూపీ ‘మొదటి ఎంపిక’గా మారుతుంది. ముఖ్యంగా రైతులకు తమ ఉత్పత్తులను పెద్ద మార్కెట్లకు వేగంగా తరలించే అవకాశం కలుగుతుంది. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తర భారతదేశ వృద్ధికి చోదక శక్తి. ఇది రాబోయే కాలంలో రాష్ట్ర ఆర్థిక చిత్రాన్నే మార్చివేస్తుంది. ప్రయాణ సమయం గణనీయంగా ఆదా కావడం వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో ఉత్తర ప్రదేశ్ స్థానంలో నిలుస్తుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్గాలు:

యమునా ఎక్స్‌ప్రెస్‌వే: నోయిడా నుండి ఆగ్రా వరకు

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే: లక్నో నుండి ఘాజీపూర్

బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే

గోరఖ్‌పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్‌ వే

నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌ వే

నోయిడా నుండి ఘాజీపూర్ వరకు, భారత్‌కప్ నుండి ఇటావా వరకు ఇప్పటికే విస్తరించిన ఈ మౌలిక సదుపాయాలు, ఉత్తర ప్రదేశ్‌ను భారత దేశపు ‘ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రం’గా గర్వంగా నిలబెడుతున్నాయి. 2029 నాటికి యూపీ నిర్దేశించుకున్న 3,200 కిలోమీటర్ల లక్ష్యం భారత మౌలిక సదుపాయాల రంగంలో ఒక సరికొత్త రికార్డు సృష్టించబోతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..